పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి

25 Oct, 2023 13:23 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్‌ పనులను ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్‌ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని పరిశీలించామని.. లోయర్‌, అప్పర్‌ కాఫర్‌ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. డీ వాటర్‌ వర్క్‌ అనంతరం వైబ్రో కాంపాక్ట్‌ పనులు మొదలవుతాయన్నారు. లోయర్‌ అప్పర్‌ కాఫర్‌ డ్యాంల మధ్య.. సీఫేస్‌ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి అంబటి తెలిపారు.

‘‘నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 41.15 కాంటూరు వరకు టీడీపీ హయాంలో వేసిన అంచనాకు నేటికి ఖర్చు పెరిగింది. 41.15 వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీకి బిల్లు పంపాం. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాలి. 41.15 వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటాం. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్‌ కలిశారు’’ అని మంత్రి తెలిపారు.
 

మరిన్ని వార్తలు