రైతు బేజార్

16 Sep, 2014 01:24 IST|Sakshi
రైతు బేజార్
  • పాస్‌పుస్తకాలకు ఆధార్ అనుసంధానం కోసం ఒత్తిడి
  •  జిల్లాలో 62 శాతమే పూర్తి
  •  19లోపు నూరు శాతం పూర్తిచేయాలని టార్గెట్
  •  సహకరించకపోతే మాఫీ, సబ్సిడీలు వర్తించవని హెచ్చరిక
  •  ఆందోళనలో అన్నదాతలు
  • గుడివాడ : పాలకులు రుణమాఫీ పేరుతో రైతులను వంచించారు. బ్యాంకుల్లో రైతులకు అప్పు ఇవ్వకుండా చేశారు. అష్టకష్టాలు పడి ఆలస్యంగా అయినా ఖరీఫ్ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలను పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్ అనుసంధానం పేరుతో అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఆధార్ అనుసంధానంపై రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో రైతుల్లో నానాటికీ ఆందోళన పెరుగుతోంది. పాస్‌పుస్తకాలకు ఈ నెల 19వ తేదీలోపు ఆధార్ అనుసంధానం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

    ఈ మేరకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆస్తి అయినా పంచుకుని దానికి ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని రైతులకు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు, అసలే అప్పు చేసి సాగు చేపట్టామని డబ్బుల్లేవని మరికొందరు ఆస్తుల పంపకాల జోలికి వెళ్లడంలేదు. అయినప్పటికీ ఆధార్ అనుసంధానం పూర్తికాకపోతే భవిష్యత్తులో అన్ని సంక్షేమ పథకాలకూ దూరమవుతారని రైతులను అధికారులు బెదిరిస్తున్నారు.  
     
    జిల్లాలో 62శాతమే పూర్తి

    జిల్లాలో ఇప్పటి వరకు 62 శాతం పట్టాదార్ పాస్ పుస్తకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 5,19,059 పాస్ పుస్తకాలకు గానూ, ఇప్పటి వరకు 3,20,816 పాస్ పుస్తకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం పూర్తయింది. గుడివాడ డివిజన్‌లో 64 శాతం, విజయవాడ డివిజన్‌లో 59.87 శాతం, మచిలీపట్నం డివిజన్‌లో 63.31శాతం, నూజివీడు డివిజన్‌లో 61.55 శాతం ఈ ప్రక్రియ పూర్తయింది.
     
    గ్రామ సభలు నిర్వహించినా..

    గడువు సమీపిస్తుండటంతో అధికారులు గ్రామసభలు నిర్వహించి ఆధార్ నమోదుకు కసరత్తు చేస్తున్నారు. కూలి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు వచ్చి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నారు. ఉమ్మడి ఆస్తులను పంచుకుని అయినా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రైతులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానం ద్వారా బోగస్ పేరుతో లక్షలాది రేషన్ కార్డులను తొలగించారని, ఇప్పుడు పొలాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

    రుణమాఫీ వ్యవహారం తేల్చకుండా తమను మోసం చేసిన ప్రభుత్వం ఆధార్ పేరుతో మళ్లీ ఏం చేస్తుందోనని అన్నదాతలు మండిపడుతున్నారు. మరోవైపు రైతులు సహకరించక.. అధికారులు రోజూ ఒత్తిడి చేస్తుండటంతో రెవెన్యూ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు.
     
    వేగవంతం చేయండి
     
    గుడివాడ ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలని గుడివాడ ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్‌లోని తొమ్మిది మండలాల తహశీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్‌వోలతో మాట్లాడారు. గ్రామ సభలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధానం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్న వీఆర్వోలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా రైతులతో మాట్లాడి ఆధార్ అనుసంధానం పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో గుడివాడ తహశీల్దార్ రవిశంకర్, ఆర్‌ఐ లక్ష్మోజీ, వీఆర్వోలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు