500 ట్రాక్టర్‌లతో వైఎస్సార్‌ సీపీ భారీ ర్యాలీ

5 Jun, 2018 14:50 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ ట్రాక్టర్ల ర్యాలీ

సాక్షి, మైదుకూరు/వైఎస్సార్‌ కడప: రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్‌కు సాగు నీటిని అందించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్‌లతో రైతులు, వెఎస్సార్‌ సీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్‌ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. ర్యాలీ అనంతరం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు మాట్లాడుతూ.. రాజోలి ఆనకట్టను నిర్మించి కేసీ కెనాల్‌ రైతులకు న్యాయం చేయాలన్నారు.

2008లో వైఎస్సార్‌ శంకుస్థాపన చేసిన రాజోలి ఆనకట్టను వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఆనకట్టను నిర్మించడం లేదని మండిపడ్డారు. జిల్లాలోని సగం నియోజకవర్గాలకు నీరందించే రాజోలి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం తగదని వ్యాఖ్యానించారు. బుధవారం కడపలో పర్యటించనున్న చంద్రబాబుకు కనువిప్పు కలిగేందుకు ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించామని ఎంపీ అవినాష్‌ రెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తలు