చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త 

5 Jun, 2018 14:38 IST|Sakshi
రాజ్‌కుంద్రా, శిల్పా శెట్టి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ముంబై : నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ సమన్లు జారీ చేసింది. బిట్‌కాయిన్‌ స్కామ్‌కు సంబంధించి ముంబైలోని తమ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో మంగళవారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్‌ భరద్వాజ్‌కు, కుంద్రాకు కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

బిట్‌కాయిన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ పేరిట అమిత్‌ భరద్వాజ్‌ 8 వేల మందిని సుమారు రూ. 2 వేల కోట్లకు మోసం చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. ఈ ఏప్రిల్‌ నెలలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అమిత్‌ భరద్వాజ్‌, అతని సోదరుడు వివేక్‌లను పుణె పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైనా, దుబాయ్‌, హాంగ్‌కాంగ్‌లకు ఫండ్స్‌ తరలించినట్లు భరద్వాజ్‌పై అభియోగాలున్నాయి. విచారణలో భరద్వాజ్‌ ఒక్కొక్కరి పేర్లు బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ స్కామ్‌లో రాజ్‌ కుంద్రా హస్తం ఉందని నిర్ధారణ కావటంతో ఆయనపై బీసీసీఐ నిషేధం కూడా విధించింది. 

మరిన్ని వార్తలు