ఇదీ అసలు కథ

2 Nov, 2018 09:58 IST|Sakshi
పోలీసులు అదుపులో శ్రీనివాసరావు (ఫైల్‌)

ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు రోజు రహస్య ప్రదేశంలో ‘పోలీస్‌’ విచారణ

తాము చెప్పినట్లే చెప్పాలని కోచింగ్‌

సాక్షి, విశాఖపట్నం: పోలీస్‌ బాస్‌ ఏం చెప్పారో అవే మాటలు నిందితుడు శ్రీనివాసరావు నోటి వెంట చెప్పించేందుకు ‘సిట్‌’ బృందం తమదైన పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందురోజు ఎవరికంటా పడకుండా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పోలీస్‌ శైలిలో కోటింగ్‌ ఇచ్చి తాము చెప్పినట్లే మీడియాకు చెప్పాలని కోచింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. కస్టడీకి తీసుకున్న మూడోరోజు ప్రైవేటు వైద్యుడు సూచించాడంటూ కేజీహెచ్‌కు తరలిస్తూ హైడ్రామా ఆడారు. పోలీస్‌స్టేషన్‌ లోపలినుంచి గుమ్మం వరకు తనంతట తానుగా నడిచి వచ్చిన అతడు ఉన్నట్టుండి కూలబడి పోయాడు. ('పిచ్చి’ కుట్రలు)

పోలీసులు రెండు చేతులు పట్టుకుని జీపు ఎక్కించడం.. ఆ వెంటనే నేను ప్రజలతో మాట్లాడాలి.. అంటూ అతను కేకలు వేయడం.. అక్కడనుంచి మీడియాను ఏమారుస్తూ కేజీహెచ్‌కు తరలించడం. అక్కడ అతనితో మీడియాకు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. తాను జగన్‌ అభిమానని, జగన్‌ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని, అతనితో పోలీసులు చెప్పించేందుకు విఫల యత్నం చేశారు. చివరకు తనకు ప్రాణహాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ  చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. (‘బాస్‌’ల నివేదిక సిద్ధం)

వెలుగులోకి వచ్చిన హైడ్రామా...
ఈ కథ వెనుక పోలీసులు ఆడిన హైడ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి సీపీ మహేష్‌ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా నిందితుణ్ని గాజువాక సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ మారుమూల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తెల్లవారు జామువరకు పోలీసులు తమదైన శైలిలో కోటింగ్, కోచింగ్‌ ఇచ్చి ‘రేపు కేజీహెచ్‌కు తీసుకెళ్తాం.. మీడియాకు మేము చెప్పినట్టు చెప్పు’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (జగన్‌ను చంపేయాలనుకున్నా)

మీడియా వెళ్లిపోయిన తర్వాత వేరే పోలీస్‌ స్టేషన్‌కు తరలించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తగా... కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు నిబంధనల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగించాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే అతని కదలికలు పూర్తిగా రికార్డు చేయాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో కూడా కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగిస్తున్నారు. ఇక్కడ తమదైన శైలిలో నిందితుడిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అర్ధరాత్రి తర్వాత లైట్లన్నీ ఆర్పేసి ఆ తర్వాత నిందితుడ్ని వేరే స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ తమ బాస్‌ చెప్పిన ఆ నాలుగు మాటలు చెప్పించేందుకు లాఠీలకు పని చెప్పారని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు