అమ్మా..ఈ నరకం నాకొద్దు

13 Aug, 2015 05:47 IST|Sakshi
అమ్మా..ఈ నరకం నాకొద్దు

భర్త వేధింపులు భరించలేను  సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్య
 

మదనపల్లె : మదనపల్లెలో ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లె పట్టణం దిగువకమ్మపల్లెకు చెందిన రామ్మూర్తి, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె శోభన(25) ఎంఏ బీఈడీ చదివింది. 2012 ఆగస్టు 12న పుంగనూరు మండలం చెర్లోపల్లికి చెందిన మల్లికార్జునతో ఈమెకు వివాహం చేశారు. అప్పట్లో రూ.3 లక్షల నగదు, కొంత బంగారా న్ని కట్నంగా ఇచ్చారు. అప్పట్లో మల్లికార్జున సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటూ నమ్మించాడు.   తర్వాత ఇక్కడే కంప్యూటర్ షాపు పెట్టివ్వాలని డిమాండ్ చేశాడు. కూతురు కళ్ల ముందే ఉంటుందని ఆ దంపతులు స్థానికంగా ఒక కంప్యూటర్ షాపు పెట్టించారు.

వారం తిరక్కనే షాపును అమ్మేసి హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని వెళ్లిపోయాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధించేవాడు. రెండేళ్ల కిందట  అతనిపై వరకట్న వేధింపు కేసు కూడా నమోదైంది. అప్పట్లో రాజీ పడిన ఇతను మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. రెండు రోజుల క్రితం రూ.1 లక్ష నగదు, కొంత బంగారు తేవాలని గొడవ చేశాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక  ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె లేఖ రాసి ఇంట్లోనే ఉరి వేసుకుంది. దగ్గరుంటావనుకుంటే దూరమైపోయావా తల్లీ..అంటూ శోభన తల్లి లక్ష్మిదేవి కన్నీటిపర్యంతమైంది.  టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.  మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
 
 

మరిన్ని వార్తలు