నమ్మించి..నరికేశాడు!

15 Aug, 2015 03:41 IST|Sakshi

భార్యను హతమార్చిన భర్త
 
 చినగంజాం : అనుమానంతో కట్టుకున్న భార్యను ఓ భర్త కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ సంఘటన మండలంలోని కొత్తపాలెం పంచాయతీ సత్తాయిపాలెంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తాయిపాలేనికి చెందిన మద్దిరాల కోటేశ్వరరావు కుమార్తె రమణకుమారి(26)కి కొప్పోలు రాంబాబుతో సుమారు పదేళ్ల క్రితం కులాంతర వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో రాంబాబు జులాయిగా తిరుగుతూ తరచూ మద్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడు. ఆమెను నిత్యం అనుమానించేవాడు.

ఇద్దరికి పొసగకపోవడంతో రెండేళ్ల క్రితం విడాకులు కూడా తీసుకున్నారు. కొంతకాలం రమణకుమారి పుట్టింట్లో ఉంది. ఏడాది క్రితం రాంబాబు పెద్ద మనుషులతో మాట్లాడించి భార్యతో కలిసి అత్తారింట్లోనే ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాలుగు రోజుల క్రితం మళ్లీ దంపతుల మధ్య గొడవ జరగడంతో రాంబాబు ఇంటి నుంచి వెళ్లి పోయాడు. గురువారం అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి వచ్చి ఇంట్లోని సోఫాలో కుమార్తె ఇందుతో పాటు నిద్రిస్తున్న రమణకుమారిని కొడవలితో మెడపై నరికాడు. పెద్దగా కేకలు వేసింది. అంతటితో ఆగకుండా కత్తితో ఛాతీపై దారుణంగా పొడిచి చంపాడు.

తన కళ్లెదుటే తల్లిని తండ్రి హతమార్చడం చూసి కుమార్తె ఇందు నిర్ఘాంతపోవడం మినహా ఏమీ చేయలేకపోయింది. కుమార్తె అరుపులు విని బయట నిద్రపోతున్న మృతురాలి తండ్రి కోటేశ్వరరావు, తల్లి, కుమారుడు తలుపులు తీసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా హంతకుడు ముందుగానే తలుపులకు గొళ్లేలు వేయడంతో పాటు అవి రాకుండా బలంగా తాడుతో కట్టాడు. కొద్దిసేపటికి స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై బి.నరసింహారావు పరిశీలించారు. శుక్రవారం మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టుం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల డీఎస్పీ జయరామరాజు, ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావులు వచ్చి వివరాలు సేకరించారు.  

 కన్నీటిపర్యంతమైన పిల్లలు
 తల్లిని కళ్లెదుటే దారుణంగా తండ్రి హత్య చేస్తుండటంతో ఏమి జరుగుతుందో తెలియని అమాయక స్థితిలో ఉన్న చిన్నారి ఇందు, కుమారుడు ఆ తర్వాత కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి తల్లిదండ్రులు భోరున విలపించారు.

మరిన్ని వార్తలు