ఎంతపని చేశావమ్మా..

11 Aug, 2015 04:51 IST|Sakshi
ఎంతపని చేశావమ్మా..

- హాస్టల్ గదిలో విషంతాగిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని  
- కడప రిమ్స్‌కు తరలించేలోపు మృతి
- సెల్‌ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారణ
- గుండెలవిసేలా విలపించిన తల్లిదండ్రులు.. ట్రిపుల్ ఐటీలో విషాదం
వేంపల్లె :
కొద్ది నెలల్లో విద్య పూర్తి చేసుకుని ఉద్యోగమో.. లేక ఉన్నత చదువుకో వెళ్లాల్సిన వడ్డె భారతి (21) ఆత్మహత్య చేసుకుందని తెలియగానే ట్రిపుల్‌ఐటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులందరూ ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కంప్యూటర్ సైన్స్ నాలుగవ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని చదువులో బాగా రాణించేది. పదవ తరగతిలో మంచి మార్కులతో ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమతుగుండం గ్రామానికి చెందిన మద్దిలేటి, అలివేలమ్మ దంపతుల మూడవ కుమార్తె.

తండ్రి బేల్దార్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది నెలల్లో భారతి ట్రిపుల్‌ఐటీలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుంటుందని, తమ కష్టాలు తీరుతాయనే సంతోషంలో ఉన్న వారికి సోమవారం అందిన వార్త షాక్‌కు గురి చేసింది. హుటాహుటిన కడపలోని రిమ్స్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘ఆదివారం రాత్రి ఫోన్‌లో మాట్లాడాం.. సంతోషంగా కబుర్లు చెప్పుకున్నాం.. ఏం జరిగిందో ఏమో.. మా పిల్ల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు.. ధైర్యవంతురాలు ఇలా చేసిందంటే మేం నమ్మలేకపోతున్నాం.. సారూ.. పూర్తిగా విచారించండి’ అంటూ వారు గుండెలవిసేలా రోదించారు. ఓ దశలో తల్లి అలివేలమ్మ నిల్చోలేక కుప్పకూలిపోయింది.
 
అయ్యో భారతి..
తన పని తాను చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లని భారతి సోమవారం హాస్టల్ గదిలో విషం తాగిందని తెలియగానే ఒక్క సారిగా విద్యార్థులు నివ్వెరపోయారు. ప్రథమ చికిత్స అనంతరం భారతిని హుటాహుటిన ట్రిపుల్ ఐటీ అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. ‘దేవుడా..భారతికి ఏం కాకూడ దు.. ఆరోగ్యంగా తిరిగి రావాలి’ అంటూ ప్రార్థించారు. ‘బాగా చదివే అమ్మాయి.. ఇలా చేసిందేమిటి.. ఏమైనా కష్టమొచ్చింటే ధైర్యంగా చెప్పి ఉండాల్సింది.. అందరం మద్దతుగా నిలిచేవాళ్లం. ఇలా చే సి కన్నవాళ్లకు గుండె కోత మిగిల్చడం బాగోలేదు’ అంటూ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
పూర్తి స్థాయిలో దర్యాప్తు
హాస్టల్ గదిలో భారతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌ల ఆధారంగా  ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ‘విష్ యూ హ్యాపీ బర్త్‌డే.. కను రెప్పలు కలుసుకోవాలని కలవరుపడుతున్నాయి.. కనుమరుగై నీ రూపాన్ని కనుపాపకు చూపాలని నా ప్రయత్నం.. ఈ ప్రయాణం నీ కోసం (ఆర్)...’ అనే మెసేజ్ డ్రాప్ట్‌లో ఉన్నట్లు తెలిసింది.
 
సెల్‌ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం

పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్ నాయుడు ట్రిపుల్‌ఐటీ హాస్టల్‌లోని భారతి ఉండే 72వ గదిని పరిశీలించారు. ఆమె వాడుతున్న సెల్‌ఫోన్, విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ పుస్తకంలో రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆరోగ్యం బాగోలేదు.. ఈ రోజు నేను క్లాస్‌కు రాను అని చెప్పింది.. దీంతో మేము క్లాస్‌కు వెళ్లిపోయాం.. మధ్యాహ్నం గదికి వచ్చాము.. భారతి పడిపోయి ఉంది.. సారోళ్లకు విషయం చెప్పాము.. భారతి బాగా చదివేది.. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి దాకా మంచి మార్కులు తెచ్చుకుంది.. ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదు..’ అని ఆమె గదిలో ఉంటున్న విద్యార్థినులు కావ్య, సుందరమ్మ, ఇతర విద్యార్థులు కన్నీటిసుడుల మధ్య గద్గద స్వరంతో చెప్పారు.

నాన్నా.. అమ్మా క్షమించండి
ఈ ఆఖరి క్షణంలో ఏమి రాయాలో అర్థం కాలేదు. నాన్నా.. చేతులు వణుకుతున్నాయి.. మీ ఆశలను, నమ్మకాలను చంపేసి వెళుతున్నందుకు నన్ను క్షమించండి.. అమ్మా.. నీకు కడుపు కోత పెట్టిస్తున్నందుకు క్షమించమ్మా.. నావల్ల ఎవరూ బాధపడటం నాకు ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నా..
- క్షమాపణలతో మీ భారతి..

 

మరిన్ని వార్తలు