‘మృగాళ్ల ’ ముఠా అరెస్ట్

24 Aug, 2014 02:13 IST|Sakshi
‘మృగాళ్ల ’ ముఠా అరెస్ట్

విజయవాడలో విద్యార్థినుల అసభ్య చిత్రాలు తీసి బెదిరిస్తున్న ముఠా
10 మంది బాధితులు.. రహస్యంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు

 
విజయవాడ బ్యూరో: యుక్త వయస్సులో ఉన్న విద్యార్థినుల బలహీనతలను పట్టేసి మెల్లగా ఉచ్చులోకి లాగి మొబైల్ కెమెరాల ద్వారా వారిని నగ్నంగా చిత్రీకరించి బెదిరించే ముఠాను విజయవాడ నగర పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల డీసీపీ తఫ్సీల్ ఇక్బాల్‌తో కలిసి శనివారం విజయవాడలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. నగరంలో చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న సాయిరాం, దీపక్, అభిలాష్‌కుమార్, షేక్ మున్నా, మరో మైనర్ విద్యార్థి..ముఠాగా ఏర్పడ్డారన్నారు.

ఏడాదిన్నర కాలంగా వీరు మధ్య, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థినులతో స్నేహం చేయడం, వారిని మోటార్ బైక్‌లపై తిప్పి, విలాసవంతమైన హోటళ్లకు తీసుకుని వెళ్లడం, చిన్నపాటి కానుకలు ఇచ్చి ఉచ్చులోకి లాగటం చేస్తున్నారని కమిషనర్ చెప్పారు. తమ మైకంలో పడ్డ అమ్మాయిలను లాడ్జిలు, తెలిసిన వారి గదులకు తీసుకుని వెళ్లి మొబైల్ కెమెరాల్లో నగ్న దృశ్యాలను చిత్రీకరించినట్లు చెప్పారు.  నగరానికి చెందిన పది మంది విద్యార్థినులు చిన్న తప్పటడుగు వేసి దాన్ని వెనక్కు తీసుకోలేక ఈ ఊబిలో ఇరుక్కుపోయారన్నారు.బయటకు తెలిస్తే ఆడపిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో కొందరు తల్లిదండ్రులు ఈ విషయాన్ని బయటకుచెప్పలేక బాధపడుతున్నారని తెలిపారు.

కొందరు యువతులు ఈ ముఠా సభ్యులకు బంగారు గొలుసులు, చెవి కమ్మలు ఇచ్చినట్లు వెల్లడైందని కమిషనర్ వెంకటేశ్వరరావు చెప్పారు. ఇటీవల ఒక బాధితురాలు తమను సంప్రదించడంతో విద్యార్థి భవిష్యత్తు, ఆ కుటుంబం గౌరవానికి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో రహస్యంగా దర్యాప్తు జరిపినట్లు కమిషనర్ చెప్పారు. ఈ ముఠాలోని సభ్యులు ఇంటర్ చదువుతున్న బాలుడిని కూడా తమతో చేతులు కలిపేలా చేశారన్నారు. ఈ ఐదుగురిని అరెస్టు చేసి వారిపై నిర్భయ చట్టంతో పాటు, ఐపీసీలోని మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
 

మరిన్ని వార్తలు