పురుగుమందు తాగిన ప్రేమజంట

25 Feb, 2014 00:33 IST|Sakshi
పురుగుమందు తాగిన ప్రేమజంట
  •      {పియురాలు మృతి
  •      చావుబతుకుల్లో ప్రియుడు
  •      నర్సీపట్నంలో దుర్ఘటన
  •  నర్సీపట్నం, న్యూస్‌లైన్ :  ప్రేమిం చిన వ్యక్తిని వదులుకోలేక... తల్లిదండ్రుల మాట జవదాటలేక సంకటస్థితిలో ఒక ప్రేమజంట చావే శరణ్యమనుకుంది. కలిసి జీవించలేకపోయినా కనీసం కలిసి మరణించాలనే నిర్ణయానికి వచ్చారు. తమను ఎవరూ గమనించకూడదనే ఉద్దేశ్యంతో పట్టణానికి దూరంగా ఉన్న చెరకుతోటలోకి వెళ్లి పురుగులమందు తాగి ఆ జంట ఆత్మ త్యాగానికి పాల్పడింది. వీరిలో యువతి తనువుచాలించగా యువకుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

    శివపురానికి చెందిన ఏలూరు వసంతి(17), గంగాధరవీధికి చెందిన గడపా శివ(22) ప్రేమించుకుంటున్నారు. 10వ తరగతి వరకు చదువుకున్న శివ అబీద్ సెంటర్‌లో పళ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆ రహదారి మీదుగా నిత్యం కళాశాలకు వెళ్లే వసంతితో శివకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం వసంతి ఇంట్లో తెలియడంతో వారు మందలించినట్టు తెలిసింది. బ్యాంకు ఉద్యోగి కుమార్తె అయిన తనను పళ్ల వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయరేమోనని తోటి స్నేహితురాళ్ల వద్ద మథనపడేది.

    ఈ పరిస్థితుల్లో చావే దిక్కనుకుని ఇద్దరూ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సోమవారం యథావిధిగా కళాశాలకు వెళ్లిన వసంతి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బయటకు వచ్చింది. అనంతరం ఇంటికి వెళ్లిన వసంతి స్నేహితురాలి ఇంటికని చెప్పి బయటకు వచ్చి శివతో కలిసి గబ్బాడకు దగ్గరలోని నెల్లిమెట్టకు సమీపంలో గలచెరకుతోటలోకి వెళ్లింది. అక్కడ ఇద్దరూ బలవన్మరణానికి యత్నించారు.
     

మరిన్ని వార్తలు