కొమురం భీమ్ 73వ వర్ధంతి

18 Oct, 2013 04:26 IST|Sakshi
నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన గిరిజన ముద్దుబిడ్డ. జల్.. జంగల్.. జమీన్ అంటూ ఆదివాసీలకు అండగా నిలిచిన బాంధవుడు. జాగీరు వ్యవస్థను పారద్రోలిన ధీరుడు. సొంత దళాన్ని ఏర్పాటు చేసి నైజాం సైన్యానికి ఎదురొడ్డిన పోరాట యోధుడు. జోడేఘాట్ గుట్టల్లో గాండ్రించిన సింహం. అక్షరం రాకున్నా.. అన్యాయాలను అడ్డుకోవడమే ధ్యేయంగా పోరాడిన ధీశా లి. స్వయానా ఆయుధాలు సమకూర్చుకుని గెరిల్లా దాడులతో దూసుకెళ్లిన సైన్యాధిపతి. చివరి వరకూ ఆదివాసీలకు భరోసానిచ్చిన ఆపద్బాంధవుడు. ఆయనే కొమురం భీమ్. కెరమెరి మండలం జోడేఘాట్ అడవుల్లో అశ్వయుజ శుద్ధ పౌర్ణమిన నిజాం సర్కార్ తుపాకీ తూటాలకు నేలకొరిగిన భీమ్ పోరాట స్ఫూర్తి అభివర్ణించలేనిది. నేడు ఆయన 73వ వర్ధంతి సందర్భంగా   ఆ వీరుడికి జిల్లా గిరి‘జనం’ సలామ్ కొడుతోంది. 
 - న్యూస్‌లైన్, ఆసిఫాబాద్
 
 ఆసిఫాబాద్/వాంకిడి, న్యూస్‌లైన్ : కొమురం భీమ్ వర్ధంతిని శుక్రవారం జోడేఘాట్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పనులను డీఎల్వీవో శ్రీనివాసరెడ్డి, ఐటీడీఏ డీఈ స్వామి, కెరమెరి ఎంపీడీవో శశికళ పర్యవేక్షించారు. దర్బార్ వద్ద శామియానాలు ఏర్పాటు చేశారు. హాజరయ్యే వారి సౌకర్యార్థం మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం కల్పించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను సాయంత్రం పీవో జనార్దన్ నివాస్ పరిశీలించారు.
 
 ముస్తాబైన భీమ్ సమాధి, స్తూపం
 గిరిజనుల హక్కుల కోసం నైజాం సర్కార్‌తో పోరాడి అసువులు బాసిన జోడేఘాట్‌లోని కొమురం భీమ్ సమాధిని ముస్తాబు చేశారు. ఆయనతోపాటు పోరాడి అసువుల బాసిన సహచరులకు ఎట్టకేలకు 73 ఏళ్ల తర్వాత  గుర్తింపు లభించింది. వారి పేర్లతో స్తూపాన్ని నిర్మించారు. దీన్ని నేడు ప్రారంభించనున్నారు. దీంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 
 
 అడుగడుగునా పోలీసుల తనిఖీలు
 కొమురం భీమ్ వర్ధంతి వేడుకులకు జోడేఘాట్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్, ఆసిఫాబాద్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జోడేఘాట్, హట్టి, చాల్బడి అడవులను జల్లెడ పడుతున్నారు. ప్రత్యేక బలగాలతో జోడేఘాట్ అడవుల్లో పోలీసు బలగాలను మోహరించారు. గురువారం కెరమెరి నుంచి జోడేఘాట్ రహదారి గుండా కల్వర్టుల వద్ద తనిఖీ చేశారు. హట్టి బేస్‌క్యాంపు వద్ద ఉట్నూర్ ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. 
 
 సంప్రదాయ పద్ధతిలో ఆవాల్‌పేన్ పూజలు
 కొమురం భీమ్ వర్ధంతికి ఒక రోజు ముందు గురువారం రాత్రి భీమ్ మనువడు సోనేరావు ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో అవాల్‌పేన్ (పోచమ్మ తల్లి) పూజలు నిర్వహించారు. డప్పుడోలు వాయిద్యాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 
 
 రాష్ర్ట పండుగలా వర్ధంతి
 భీమ్ 73వ వర్ధంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగ ఉత్సవాలుగా ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న కలెక్టర్ అహ్మద్ బాబు జిల్లా అధికారులతో జోడేఘాట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సమాధి వద్ద సంప్రదాయబద్దంగా పూజలు, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు గిరిజన దర్బార్, సాంసృతిక కార్యక్రమాలు, అనంతరం భీమ్ జీవిత చరిత్ర చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.
 
 నేడు సెలవు
 ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఆదివాసీల ఆ రాధ్యదైవం కొమురం భీమ్ 73వ వ ర్ధంతిని పురస్కరించుకుని గిరిజన సం క్షేమ శాఖ అధీనంలోని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినటుల ఐ టీడీఏ పీవో జనార్దన్ నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జైనూర్, సిర్పూర్ (యు), కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యా ణి మండలాల్లోని ఆశ్రమ, గిరిజన, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల లకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 
 
 గ్రామ పంచాయతీ ఏర్పాటు ఏదీ..!
 జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాలు, 4 గ్రామ పంచాయతీల్లో ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ గ్రామాలన్నింటినీ ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చే స్తామన్న అప్పటి కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ నెరవేరలేదు. గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి విన్నవించాలో అర్థం కావడం లే దని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడి గ్రామ పంచాయతీలో టోకెన్‌మోవాడ్, సుర్దాపూర్ గ్రామ పంచాయతీలో కోపగూడ, కోటా రి గ్రామ పంచాయతీలో జోడేఘాట్, కల్లెగాం, ముర్కిలొంక, కెరమెరి గ్రామ పంచాయతీలో చిన్న పాట్నాపూర్, పెద్ద పాట్నాపూ ర్, బాబేఝరి, శివగూడ, లైన్ పటార్, పాటగూడ, చాల్బడి గ్రామా లు ఉండటంతో ఇవి అభివృద్ధికి నోచుకోవడం లేదు. జోడేఘాట్ గ్రా మస్తులు వారి గ్రామ పంచాయతీ అయిన కోటారికి వెళ్లాలంటే 40 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అలాగే అన్ని గ్రామాల పరిస్థితి ఇ లాగే ఉండటంతో గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. 
 
 తరచూ మా ఇంటికొచ్చేవారు..
 గిరిజన వీరుడు కొమరం భీమ్ మాటలు ఉత్తేజపరిచేలా ఉండేవి. అప్పుడు నాకు సుమారు 12 ఏళ్ల వససుండేది. భీమ్ ఉద్యమ బాటలో తరచూ మా ఇంటికి వచ్చేవారు. నా భర్త రాముతో మాట్లాడే వారు. గిరిజనులపై జరిగే అన్యాయాలను ఎదిరించే వారు. మన భూమిపై మనకు హక్కులు కావాలని, 12 గ్రామాల గిరిజన ఆదివాసీలకు జల్, జంగల్, జమీన్‌పై హక్కుల కోసం పోరాటం చేశారు. 
 - చాకటి రాజుబాయి, చిన్నపాట్నాపూర్, 
 కెరమెరి మండలం
 
మరిన్ని వార్తలు