‘ఇదో సువర్ణాధ్యాయం.. అందుకు గర్వంగా ఉంది’

15 Oct, 2019 15:59 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరుకు వస్తే ప్రకృతి కూడా పులకరించిందని అన్నారు. జిల్లాలో జరిగిన రైతు భరోసా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రకటించి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఇది దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం అని చెప్పారు. మూడు విడతలుగా సాయం ఇవ్వాలని రైతు సంఘాల నేతలు కోరడంతో అందుకు అంగీకారం తెలిపినట్టుగా వెల్లడించారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పేరును సార్థకం చేస్తూ.. సీఎం వైఎస్‌ జగన్‌ అందరికీ న్యాయం చేశారని అన్నారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ నేడు నెల్లూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచారు.

మరిన్ని వార్తలు