ఆ స్థలం స్వాధీనం

13 Jul, 2018 13:12 IST|Sakshi
 స్థలాన్ని పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసరావు తదితరులు

దేవాదాయ శాఖ వెల్లడి

ఆక్రమిత స్థలాన్ని పరిశీలించిన అధికారులు

బొబ్బిలి : పట్టణ నడిబొడ్డున ఉన్న దేవాదాయ శాఖ స్థలాన్ని విక్రయించేశారని తెలుసుకున్నామనీ, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ శ్రీనివాస్‌ వెల్లడించారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘అమ్మేస్తున్నా కిమ్మనరే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అటు దేవాదాయ శాఖ, ఇటు రెవెన్యూ శాఖలు స్పందించాయి. ముందుగా దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి విక్రయించిన స్థలాన్ని పరిశీలించారు.

ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఉన్న గోడ కూలగొట్టిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడ వద్ద గ్రామకంఠం ఉండగా అందులో దేవాదాయ శాఖకు చెందిన 20 గజాలు రోడ్డు విస్తరణలో పోయిందన్నారు.

మిగతా 66 గజాలు ఉంటుందని చెప్పారు. సర్వే నంబర్‌ 350 ప్రకారం ఇక్కడ కొబ్బరి, మామిడి, పనస చెట్లుండేవనీ కాలక్రమేణా చెట్లను కూలదోసి ఆక్రమించుకున్నారన్నారు. దీనికి సంబంధించిన వివరాలు, కాగితాలు తమ వద్ద లేవని, కోటలో ఉన్నాయని చెప్పడం విశేషం. దేవాదాయ శాఖ చట్టం 43 రిజిస్టర్‌ ప్రకారం తమవద్ద ఈ స్థలానికి సంబంధించిన వివరాలున్నాయన్నారు. 

రెవెన్యూ శాఖ సందర్శన 

ఆ ప్రాంతాన్ని గురువారం సాయంత్రం రెవెన్యూ సర్వేయర్‌ విఘ్నేశ్వరరావు, ఆర్‌ఐ శివున్నాయుడు, వీఆర్వో చంద్రశేఖర్‌లు పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటీ ఏ విధమయిన అనుమతులు ఇచ్చినదీ పరిశీలించారు. తహసీల్దార్‌ విజయనగరం ఎన్నికల విధుల సమావేశానికి వెళ్లడంతో సర్వేయర్, ఆర్‌ఐలు పరిశీలించారు. పక్కన నిర్మాణాలు చేస్తున్న వారి వివరాలు, వాటి హద్దులను పరిశీలించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

మరిన్ని వార్తలు