దేశ రాజధాని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షపై ఆయన తనయుడు లోకేష్ బాబు ట్విట్టర్ లో స్పందించాడు. చంద్రబాబు తన దీక్ష ద్వారా కేవలం 24 గంటల్లోనే దేశం మొత్తాన్ని ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా చేశారని తన వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు.
తన తండ్రి చంద్రబాబు దీక్షకు వచ్చిన స్పందన చూడలేకే ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ ఇక్కడ నుంచి పంపించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై చర్చించడానికి ఇరు ప్రాంతాల నేతలను చర్చలకు పిలిచేంతవరకు దీక్ష శిబిరం నుంచి కదలం అని ట్విట్టర్ బాబు లోకేష్ అన్నారు.
అయితే ఆంధ్ర భవన్ లో దీక్ష చేపట్టిన చంద్రబాబును రాష్ట్ర విభజనపై జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరైన సంగతి తెలిసిందే. జాతీయ మీడియా అడిగిన పలు ప్రశ్నలపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా దీక్ష చేపట్టిన చంద్రబాబును ఖాళీ చేయాలంటూ ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేశారు.