అహంకారంతో విర్రవీగితే చూస్తూ ఊరుకోం: ఎమ్మెల్యే శ్రీదేవి

12 Sep, 2019 17:49 IST|Sakshi

టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ నేతలు అహంకారంతో విర్రవీగుతూ.. కుల వివక్షత చూపుతున్నారని తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వినాయక మండపం వద్ద కులం పేరుతో దూషించిన టీడీపీ నేతలపై ఎస్సీ,మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశానని తెలిపారు. కుల వివక్షత ప్రదర్శించిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరినట్లు చెప్పారు. టీడీపీ నేతల ఆగడాలను చూస్తూ ఊరుకోమని..అడ్డుకుంటామన్నారు. కేసులోని నిందితులందరికీ శిక్షలు పడేవరకు పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో విశాఖ జిల్లా జెర్రిపోతుల గ్రామంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కర్నూలు జిల్లాలో శవాన్ని పూడ్చిపెట్టేందుకు గొయ్యి తవ్వినందుకు దళితుల ఆస్తులన్నింటినీ ధ్వంసం చేశారని తెలిపారు. నారా వారిపల్లెలో దశాబ్దాలుగా దళితులను  ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకుంటే...వైఎస్‌ జగన్‌ పల్లకిలో మోస్తున్నారు..
‘ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా’ అని గతంలో చంద్రబాబే స్వయంగా వ్యాఖ్యనించారని ఎమ్మెల్యే శ్రీదేవి గుర్తుచేశారు. యధారాజా తథా ప్రజ అన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కురని, సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించారని నిప్పులు చెరిగారు. ఎస్సీ హాస్టల్‌ను కూడా మూయించి వేశారన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకుండా వదిలేశారన్నారు. అత్యాచార బాధితుల్లో 33 శాతం మంది దళితులే ఉన్నారని వెల్లడించారు. టీడీపీ నేతలు.. దళితులను భయపెట్టి కేసులను విత్‌-డ్రా చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని.. కానీ వైఎస్‌ జగన్ మాత్రం తమని పల్లకిలో కూర్చోబెట్టి మోస్తున్నారని అన్నారు.


 

మరిన్ని వార్తలు