ఇదేమి హాజరు!

23 Dec, 2013 02:46 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  ప్రజల సమస్యలపై గళమెత్తేందుకు కీలకమైన వేదిక శాసనసభ. ఎంతటి జఠిలమైన సమస్య అయినా సభాదృష్టికి తీసుకెళ్తే ముకుమ్మడి తీర్మానంతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎమ్మెల్యేలు సభల్లో పాల్గొని సమస్యలపై పాలకవర్గాలను నిలదీయాలి. సాధించుకునేంత వరకు పట్టుబట్టే అవకాశం ఉంది. అటువంటి మహత్తర అవకాశం శాసనసభ్యులకు మాత్ర మే ఉంది. ఆ ఆశతోనే 2009తో పది మంది ఎమ్మెల్యేలను జిల్లావాసు లు అసెంబ్లీకి పంపించారు. ఎమ్మెల్యేలు ఏం చేశారు. ప్రజల ఆశలను నీరుగార్చారు. ఏజెన్సీలో ఆరోగ్యం అదుపుతప్పి అడవిబిడ్డలు ఏటా వందల మంది మృత్యువాత పడ్డారు. గల్ఫ్ బాధితుల ఇళ్లలో అంతులేని విషాదం. కొందరు అన్నదాతలు ప్రతికూల పరిస్థితులతో కాటికి వెళ్లారు.

డీజిల్, పెట్రోల్, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. అసంపూర్తి ప్రాజెక్టులు, ఉచి త కరెంటుకు మంగళం.. బడుగులకు అందని సంక్షేమ పథకాలతో ప్రజలు సతమతం అయ్యా రు.. ఈ నాలుగున్నరేళ్లలో ఇటువంటి సమస్యలపై స్పందించాల్సిన మన ఎమ్మెల్యేలు సమావేశాలకు తక్కువగా హాజరయ్యారు. ప్రజల పనుల కంటే తమ సొంత పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. శాసనసభ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేల హాజరు శాతం ఆందోళన కలిగిస్తోంది. నాలుగున్నరేళ్లలో 177 రోజుల పాటు 13వ శాసనసభ సమావేశాలు జరిగాయి. మన జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే 20 నుంచి 100 రోజుల వరకు అసెంబ్లీ ముఖం చూడలేదంటే ఆశ్చర్యపోక తప్పదు.
 డుమ్మాలో మొదటి స్థానంలో కాంగ్రెస్..
 2009 జూన్‌లో 13వ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నాలుగున్నరేళ్లలో 177 రోజులపాటు అసెంబ్లీ సమావేశమైంది. ఇందులో ముథోల్ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి 157 రోజులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ 154 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నిర్మల్ ఎమ్మెలే మహేశ్వర్‌రెడ్డి 95 రోజులు హాజరై 82 రోజులు డుమ్మా కొట్టి జిల్లా శాసనసభ్యుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 104 రోజులు సమావేశాలకు హాజరై, 73 రోజులపాటు దూరంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోడం నగేశ్ 131 రోజులు సమావేశాల్లో పాల్గొని, 46 రోజులు దూరంగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ 56 రోజులు అసెంబ్లీకి ఎగనామం పెట్టారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 2011లో రాజీనామా చేసి ఆ ఏడాది డిసెంబర్‌లో 5 రోజులు అసెంబ్లీకి దూరంగా ఉన్నా.. మొత్తంగా 67 రోజులు శాసనసభ సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్యలు రాజీనామా చేయడం వల్ల 2010 ఫిబ్రవరి-మార్చిలలో 31 రోజులపాటు జరిగిన 4వ సెషన్ సమావేశాలకు హాజరుకాలేక పోయారు. వీటిని కలుపుకుని ఆ ముగ్గురు వరుసగా 115, 100, 71 రోజులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో ప్రజలు ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపిస్తే.. అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు ఈ రీతిలో గైర్హాజర్ అయితే ఎలా? అన్న చర్చ పలువురిలో సాగుతోంది.

మరిన్ని వార్తలు