ఉన్నవి పీకేశారు... కొత్తవి ఇవ్వలేదు

3 Jun, 2015 01:49 IST|Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్ :పాతరోజులు గుర్తుకొస్తున్నాయి.. కొత్త రేషన్‌కార్డు కావాలంటే ఒకరి కార్డు రద్దు చేయాలన్నది నాడు బాబు హయాంలో ఉన్న కండిషన్... ఇప్పుడూ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. గడచిన బాబు ఏడాది పాలనలో పాత రేషన్‌కార్డులు పరిశీలన పేరుతో తొలగించారు. కొత్తవాటి కోసం అర్జీలు పెరుగుతున్నా మంజూరు చేసిన పాపాన పోలేదు. ప్రజలు నిరంతరం మీ సేవలోనూ, తహశీల్దారు కార్యాలయాల్లోనూ, గ్రామాలకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు, ఆధికారులకు అర్జీలు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే వడబోత పేరుతో జిల్లాలో దాదాపు 32వేల కార్డులను అనర్హత పేరుతో తొలగించేసిన సర్కారు వాటి పునరుద్ధరణకు సవాలక్ష ఆంక్షలు పెడుతోంది.

చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో పిల్లల ఉచిత విద్య, ఉపకార వేతనాలు, సంక్షేమ రుణాలు వంటివాటికి నోచుకోలేకపోతున్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో జరిగిన తొలివిడత జన్మభూమి కార్యక్రమంలో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ వేలాది మంది కొత్త కార్డుల కోసం దర ఖాస్తుచేసుకున్నారు. అంతే కాకుండా నేరుగా తహశీల్దారు కార్యాలయానికి ఇచ్చినవారూ ఉన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో 52,376 మంది కొత్త రేషన్ కార్డులకోసం కుటుంబాలతో కూడిన ఫొటోలు, ఆధార్ కార్డులు, ఓటరు కార్డు ఇతర ఆధారాలతో దరఖాస్తుచేసుకున్నారు.
 
అవన్నీ తహశీల్దారు కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. వీటిలో కొన్ని పరిశీలనలో ఉండగా, మరికొన్ని అన్‌లైన్ దశలో ఉన్నాయి. ఈ ప్రక్రియకు ముందు ఈ దరఖాస్తులను ఆయా గ్రామాల్లోగల జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదిస్తేనే కొత్తకార్డు కోసం అన్‌లైన్‌లో సిపార్సు చేస్తారు. కొత్త రేషన్ కార్డులకు కూడా జనాబా ప్రాతిపతిక అని నెపంతో ఆర్హులకు కూడా కోత పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు