భద్రత శివ.. శివా..!

27 Jul, 2018 08:43 IST|Sakshi

ముక్కంటి ఆలయానికి సీఎస్‌ఓ లేమి

ఎవరు పడితే వారు ఎస్‌ఓలుగా చెలమణి

గోపుర మార్గాల్లో మెటల్‌ డిటెక్టర్లు కనుమరుగు

అది దక్షిణ కాశిగా వినుతికెక్కినపల్లవుల నాటి ఆలయం..వాయులింగక్షేత్రం.. రాహుకేత పూజలకు నిలయం.. నిత్యంవేలాది మంది భక్తుల రాక.. ఏటా రూ.వంద కోట్ల పైబడిన రాబడి..ఇదీ ముక్కంటి ఆలయప్రశస్తి్త. అలాంటి ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని పర్యవేక్షించే ప్రధానభద్రతాధికారి లేరు. దీంతోఆలయ భద్రత ఆ శివయ్యకే ఎరుక.

శ్రీకాళహస్తి:ముక్కంటి ఆలయానికి నాడు పదుల సంఖ్యలో మాత్రమే భక్తులు వచ్చేవారు. ఆలయానికి వచ్చే ఆదాయం నిత్యకైంకర్యాలకే సరిపోయేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వేలాది మంది భక్తులు ముక్కంటీశును దర్శనార్థం వస్తున్నారు. దీంతో నేడు ఆలయ ఆదాయం ఏడాదికి రూ.వంద కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి పదేళ్లుగా సెక్యూరిటీ పెంచారు. ఇందులో భాగంగా ఆలయ భిక్షాలగోపురం, శివయ్య, తిరుమంజనం, దక్షిణగోపుర మార్గాల్లో  మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలం క్రితం ఆ మెటల్‌ డిటెక్టర్లను తొలగించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీలు చేయడం మానేశారు. ఆలయంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాస్టర్‌ప్లాన్‌ నేపథ్యంలో దేవస్థానానికి అన్ని వైపుల దారులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆలయానిక భద్రత కరువైంది. 

ఆలయానికి సీఎస్‌ఓ కరువు
శ్రీకాళహస్తి దేవస్థానానికి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(సీఎస్‌ఓ) కరువయ్యారు. మూడు నెలలుగా ఆలయానికి సీఎస్‌ఓ లేరు. దీంతో ఎవరు పడితే వారు తామే ఆలయ భద్రాతా సిబ్బందికి ఇన్‌చార్జి అని చెప్పుకుంటూ చెలమణి అవుతున్నారు. దేవస్థానంలో 120 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది(ఏజెన్సీల ద్వారా), 35 మంది హోంగార్డులు, 18 మంది ఎస్పీఎఫ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. ప్రధానంగా ఆలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బం దికి డ్యూటీలు వేయడంతో పాటు ఎవరూ ఏ పాయింట్‌లో ఉండాలి, భక్తులతో మర్యాదపూర్వకంగా ఎలా మెలగాలి, భక్తుల సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయాలతోపాటు ఎవరూ ఏ ప్రాంతంలో డ్యూటీలు నిర్వహించాలన్న విషయాలను సీఎస్‌ఓ పర్యవేక్షించాల్సి ఉంది.  ఆలయానికి సీఎస్‌ఓ లేకపోవడంతో పలువురు పెత్తనం చేస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. దీంతోనే ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఇదే అదునుగా భక్తులను దళారీలు మోసం చేస్తున్నారు. మరోవైపు దేవస్థానంలో పనిచేస్తున్న 35 మంది హోంగార్డులు శ్రీకాళహస్తి డీఎస్పీ కంట్రోల్‌లో పనిచేస్తుంటారు. ఇక 18 మంది ఎస్పీఎఫ్‌ ఉద్యోగులు తిరుపతిలోని వారి బ్రాంచ్‌ కార్యాలయ డీఎస్పీ కంట్రోల్‌లో పనిచేస్తున్నారు.అయితే  వీరిలో పలువురు భక్తులను అడ్డదిడ్డంగా దర్శనాలు చేయించి, వారి నుంచి డబ్బులు గుంజుతున్నారనే విమర్శలున్నాయి. దీనికితోడు ఆలయంలో ఇటీవల కాలంలో చోరీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి భద్రత కరువైందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

అభద్రతకు నిదర్శనాలివీ..
దేవస్థానంలో గతంలో హుండీలతోపాటు హుండీల లెక్కింపు సమయంలోను చోరీలు జరిగాయి.
ఆలయానికి చెందిన మింట్‌లో నాగ పడగలను చోరీ చేశారు.
పోటులో నూనె, నెయ్యి డబ్బులు సైతం చోరీకి గురయ్యాయి.
బ్రహ్మగుడి వద్ద దేవస్థానానికి చెందిన కొన్ని ఆభరణాలను కొందరు తరలించే ప్రయత్నం చేయగా భక్తుల సమాచారంతో వాటిని దక్కించుకున్నారు.
దేవస్థానంలో పలువురు భక్తుల పర్సులతోపాటు సింగపూర్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలికి చెందిన డైమండ్‌ నెక్లస్‌ చోరీకి గురైంది.

భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
దేవస్థానానికి సం బంధించి భద్రత విషయంలో ప్రత్యే క శ్రద్ధ చూపుతాం. ఆలయానికి త్వరలో సీఎస్‌ఓను ని యమిస్తాం. భక్తులతో మర్యాదగా వ్యవహరించని వారిపై చర్యలు తప్పవు.   మెటల్‌ డిరెక్టర్ల పునరుద్ధరణ విషయంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాస్టర్‌ప్లాన్‌లో బిజీబిజీగా ఉన్నమాట వాస్తవమే. అయినా ఆలయ పరిపాలనపై ప్రత్యేక నిఘా ఉంచాం.
–రామస్వామి, ఈఓ,శ్రీకాళహస్తీశ్వరాలయం

మరిన్ని వార్తలు