విదేశాల్లో వలస జీవుల మృతి

17 Jan, 2014 04:31 IST|Sakshi

తాండూర్, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన తాండూర్‌కు చెందిన జబిఖాన్ గురువారం ఉదయం గుండెపోటుతో సౌదీలో మృతిచెందాడు. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జబిఖాన్ సౌదీ అరేబియాలోని ఓ ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఉదయం ఆఫీసుకు వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటు వచ్చింది. సహచరులు ఆస్పత్రికి తరలించగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన భార్య ముమినాబేగం, కుమారుడు జబీర్‌ఖాన్ ఉన్నారు. జబిఖాన్ పెద్ద కుమారుడు జుమెదఖాన్ ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి మృతిచెందాడు. అప్పటి నుంచి స్థానికంగా ఉన్న జబిఖాన్ బక్రీద్ అనంతరం సౌదీ వెళ్లాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
 
 మస్కట్‌లో..
 కడెం : మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన బూక్యా మనీష్(32) మస్కట్‌లో రెండ్రోజుల క్రితం మృతిచెందాడు. ఈ మేరకు గురువారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మనీష్ ఏడాది క్రితం ఆజాద్ వీసాపై మస్కట్‌లోని ఓ కంపెనీలో కూలీగా పనిచేసేందుకు వెళ్లాడు. ఆయనకు భార్య లలిత, కూతురు అఖిల, కుమారుడు అరవింద్ ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనీష్ మృతిచెందాడు. అతడి సమీప బంధువు వెంకటేశ్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మృతుడి కుటుంబాన్ని గ్రామ సర్పంచు శకుంతులప్రభాకర్, నాయకులు డి.వెంకటేశ్, టి.సత్యనారాయణ, ఆత్రం రవీందర్ పరామర్శించారు.

>
మరిన్ని వార్తలు