అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు..

17 Jun, 2014 02:59 IST|Sakshi
అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు..

రాజాం రూరల్: అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని సన్‌స్కూల్ ఎదురుగా సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన మీసాల అప్పలనాయుడు (23) మృతి చెందాడు. అప్పలనాయుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉండకుండా వ్యాపారం చేస్తున్న తన మేనమామ అయిన లావేటి సత్యం వద్ద పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే వృత్తిలో భాగంగా శ్రీకాకుళం రోడ్డులోని కామేశ్వరరావు పెట్రోల్‌బంకుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన టాటా ఏస్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అప్పలనాయుడు తల పగిలిపోయి మెదడు  దూరంలో ఎగిరిపడడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ అంబేద్కర్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి వ్యాన్‌ను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆస్పత్రికి తరలించారు.
 
 లచ్చన్నవలసలో విషాదం
 రేగిడి: అప్పలనాయుడు మృతితో వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు మీసాల సూరీడమ్మ, కూర్మినాయుడు, సోదరుడు శ్రీహరి, ఇద్దరు అక్కలు తల్లడిల్లిపోయారు. తమను కష్టకాలంలో ఆదుకుంటాడనుకున్న కొడుకును మృత్యువు కబళించిందని కన్నవారు రోదించారు. కాగా అప్పలనాయుడు మృతి చెందాడన్న సమాచారంతో లచ్చన్నవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు