అంతర పంటలతో అద్భుత లాభాలు

26 Aug, 2013 03:37 IST|Sakshi

హుకుంపేట, న్యూస్‌లైన్: అంతర పంటలతో అద్భుత లాభాలు సాధిస్తున్నారు మాలీ తెగ గిరిజన రైతులు. అరకు నియోజక వర్గంలోని దోడిపుట్టు, మాలీవలస, పనసవలస, కండ్రుం, సోవ్వా తదితర గ్రామాల్లోని ప్రతి రైతు తమకున్న భూమిలో వివిధ రకాల అంతర పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించని కూరగాయలంటూ ఏమీ ఉండవు.పండిన అన్ని ఉత్పత్తులను ఏజెన్సీలోని వసతి గృహాలకు, వారపు సంతలకు, విశాఖలోని రైతుబజార్లకు తరలించి లాభాలు ఆర్జిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నందున ఎంతో రుచికరంగా ఉంటాయి.

విశాఖ రైతుబజార్లలో విక్రయించే కూరగాయల్లో సగానికిపైగా ఇక్కడ నుంచి సరఫరా చేసినవే కావడం విశేషం. ప్రతి రైతు తమకున్న భూమిలో క్యాబేజీ, కాలీఫ్లవర్, వంగ, బెండ, బీర, చిక్కుడు, ఉల్లి, బంగాళదుంపలు, ఆవాలు, కొత్తిమీర, టమాట వంటి పంటలన్నీ పండిస్తున్నారు. మన్యంలోని మిగిలిన రైతులకు భిన్నంగా పూర్తి ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు.

ఒక వరుసలో క్యాబేజీ, రెండో వరుసలో వంగ, మూడో వరుసలో ఉల్లి ఇలా రకరకాల పంటలు వేయడం వల్ల వ్యాధుల ఉధృతి తక్కువగా ఉంటుందని గిరిజన రైతులు చెబుతున్నారు. పొల ం గ ట్లపై సాగు చేసే ఆవాల ద్వారా కూడా వారు మంచి ఆదాయం రాబట్టగలుగుతున్నారు. పల్లపు ప్రాంతా ల్లో కాకుండా ఏటవాలుగా ఉన్న కొండలను వారు కూరగాయల సాగుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ గ్రామాల్లోని ప్రతి రైతు వారానికి రూ.5 వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందుతూ ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు