‘రాజధానిలో ఇల్లు ఉండాలనే స్థలం కొన్నాం'

6 Mar, 2017 20:23 IST|Sakshi
‘రాజధానిలో ఇల్లు ఉండాలనే స్థలం కొన్నాం'

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ప్లాట్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి  అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రాజధానిలో ఇల్లు ఉండాలనే ఉద్ధేశంతోనే తాము స్థలం కొన్నామన్నారు. లాటరీలో ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని మంత్రి పల్లె పేర్కొన్నారు.  కాగా మంత్రి కుమారుడు పల్లె వెంకటకృష్ణారెడ్డి పేరున నేలపాడు గ్రామంలో 2,520 చదరపు గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటు పక్కనే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ప్రభుత్వ షాపింగ్‌ క్లాంప్లెక్స్‌ల జోన్‌ ఉంది.

అలాగే లాటరీ విధానంపై  సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ  లే అవుట్‌ ప్రకారం పెద్ద ప్లాట్లన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధానం అంతా పారదర్శకంగానే జరిగిందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో అధికార టీడీపీ పెద్దలు అడుగడుగునా మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో భూములను కారు చౌకగా కొట్టేసి రైతులను నిలువునా ముంచిన టీడీపీ నేతలు.. ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం రూపంలో అతి విలువైన ప్లాట్లను కొట్టేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు