తల్లిదండ్రుల ఓటు ఇంగ్లిష్‌ మీడియానికే

17 Apr, 2020 05:37 IST|Sakshi

అన్ని పాఠశాలల పేరెంట్స్‌ కమిటీలు ఇంగ్లిష్‌ మీడియం కోసం తీర్మానాలు

టీచర్లు కూడా ఆంగ్ల మాధ్యమానికే మద్దతు.. శిక్షణకు అపూర్వ స్పందన

లాక్‌డౌన్‌లోనూ ‘బోధ్‌ శిక్షా’ యాప్‌తో టీచర్ల అభ్యాసం

విద్యార్థులకూ ఆంగ్లంపైనే ఆసక్తి.. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన చేరికలు

ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టీకరణ

ప్రైవేట్‌ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియమే

అయినా నోరు మెదపని ప్రతిపక్షాలు.. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఇంగ్లిష్‌ మీడియానికి నో

పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని, ప్రపంచంతో పోటీపడాలని ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కొనేలా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తల్లిదండ్రులందరూ మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు.. ఆ పై సంవత్సరాల్లో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమ లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు తమ స్కూళ్లలో పిల్లలకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యనందించాలని తీర్మానాలు చేసి పంపించాయి. విచిత్రం ఏమిటంటే ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగు తోంది. తెలుగు మాధ్యమం ఆప్షన్‌ వారి దరఖాస్తు ఫారాల్లో ఉండదు. తెలుగును పూర్తిగా విస్మరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు సబ్జెక్టును ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాల ప్రకారం కాకుండా తమ వర్క్‌ పుస్తకా ల ద్వారా ప్రశ్నలు, జవాబులను బట్టీ పట్టిస్తున్నాయి.

బడుగులకు ఇంగ్లిష్‌ మీడియం వద్దా?
► ప్రభుత్వ పాఠశాలల్లో దిగువ మధ్య తరగతి, పేద, బడుగు, బలహీన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారు. వారందరికీ ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను అందించడానికి, నాణ్యమైన చదువు చెప్పించడానికి వైఎస్‌ జగన్‌ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని వేగంగా అడుగులు వేసింది.
► ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ జీవోలు జారీ చేసింది. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో, సామాజిక బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకుందని బడుగు, బలహీన వర్గాల నుంచి విశేష స్పందన వచ్చింది.
► సమాజంలోని అన్ని వర్గాలు.. ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా.. ‘మాతృ భాష పరిరక్షణ’ పేరుతో పలు రూపాల్లో అడ్డుతగలడం ప్రారంభించాయి.
► ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని.. మాతృభాషకు ఇబ్బంది రానివ్వమని ప్రభుత్వం ఎంత చెప్పినా వారి చెవికెక్కలేదు.
► ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదలు, ఆ పార్టీ నాయకులంతా వ్యతిరేకించారు. ఏదో రకంగా అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. న్యాయ స్థానాలను ఆశ్రయించి, ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకున్నారు.
ఆహ్వానించిన టీచర్ల సంఘాలు
► రాష్ట్రంలోని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి.

ఇంగ్లిష్‌ మీడియం బోధనకు సిద్ధం
► ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును మరింత పరిపుష్టం చేసేలా తప్పనిసరి చేస్తూ ఆ పాఠ్యపుస్తకాలను మరింత పటిష్టమైన రీతిలో రూపొందించింది.
► టీచర్లకు ఆంగ్ల మాధ్యమ నైపుణ్యం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే సెలవుల్లో సైతం సంతోషంగా హాజరయ్యారు. శిక్షణ లో నేర్చుకున్న అంశాల తర్వాత వారి లో మరింత ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరిగింది.  
► ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌తో ప్రభుత్వ స్కూళ్లు మూతపడి ఉన్నప్పటికీ వారంతా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బోధ్‌ శిక్షా లోకమ్‌ యాప్‌ ద్వారా ఆంగ్ల మాధ్యమ బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో నిమగ్నమయ్యా రు. స్కూళ్లు తెరవగానే తమ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే ఆయా సబ్జెక్టులను బోధించేందుకు సిద్ధమవుతున్నారు.
► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో కలుపుకొని 3,05,856 మంది టీచర్లున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది వరకు ప్రభుత్వ టీచర్లు.. టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు, ఆపై టీచర్‌ రిక్రూట్‌మెంటు టెస్టు (డిఎస్సీ)లో మెరిట్‌ సాధించి ఆయా పోస్టులు సాధించిన వారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలోనే ఆంగ్ల మాధ్యమాన్ని విజయవంతం చేయగలుగుతామని టీచర్లంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.  ఆ మేరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
► మరోవైపు తెలుగు మాధ్యమం పాఠశాలను కూడా మండలానికి ఒకటి ఏర్పాటు చేసి, విద్యార్థులు వచ్చి వెళ్లేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పించడానికి ఉత్తర్వులు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు