దారుణం

11 Jun, 2015 23:58 IST|Sakshi
దారుణం

లక్ష్యం మేరకు అప్పులు అనుమానమే
పాస్‌బుక్‌పై అన్నదాతకు ఒకే పంటరుణం
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే వర్తింపు
వరికి ఎకరాకు రూ.24 వేలు
చెరకుకు రూ.35వేలలోపే..

 
రుణమాఫీ పరోక్షంగా రైతులకు శాపమవుతోంది. ఇప్పటికే ఉన్న రుణాలు పూర్తిగా మాఫీకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు బ్యాంకుల్లో మళ్లీ అప్పు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక పాస్‌బుక్‌పై వ్యవసాయ రుణం లేదా బంగారం తాకట్టు రుణం ఇలా ఏదో ఒకటే ఇస్తారు. పైగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణం మంజూరు చేయాలని ఆర్‌బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆపై కావాలంటే ఇప్పుడున్న ఏడు శాతానికి బదులు 12 శాతం వడ్డీ భరించాల్సిందే.
 
విశాఖపట్నం : జిల్లాలో ఖరీఫీలో 2,08,988 హెక్టార్లలో సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,93,447 మంది రైతులకు షార్ట్‌టర్మ్(పంట) రుణాలుగా రూ.1200 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది కేవలం 60 శాతమే రుణాలిచ్చారు. ఈఏడాది ఏదిఏమైనా లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా యంత్రాంగం పట్టుదలతో ఉంది. గతేడాది 32 మంది కౌలురైతులకు రూ.8లక్షలు మాత్రమే రుణంగా ఇచ్చారు. ఈ ఏడాది 40వేల మందికి కౌలుఅర్హత కార్డుల జారీకి ఏర్పాట్లుతో ఆ మేరకు కార్డులు జారీ అయిన ప్రతీఒక్కరికి రుణాలివ్వాలని యోచిస్తున్నారు. కానీ వీరి ప్రయత్నాలకు ఆర్‌బీఐ నిబంధనలు గండి కొట్టేలా కనిపిస్తున్నాయి.

 విరివిగా రుణాలిచ్చేవారు... : గతంలో భూమి దస్తావేజులు, పాస్‌బుక్, టైటిల్ డీడ్‌లను  తనఖా పెట్టుకుని రైతులకు పంట రుణాలిచ్చేవారు. పంట రుణమే కాదు..ఈ పాస్‌పుస్తకం జెరాక్స్ కాపీలిస్తే బంగారు ఆభరణాలపై 7శాతం వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా మంజూరు చేసేవారు. వ్యవసాయ యంత్రాలు, పాడి, ఆక్వా తదితర వ్యవసాయానుబంధరంగాలకు అవసరాలకు తగ్గట్టుగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ రుణాలకు మాత్రం తొలిలక్ష రుణానికి జీరో పర్సంట్ వడ్డీ రాయితీ కింద... ఆ తర్వాత రెండు లక్షలకు పావలా వడ్డీ రాయితీని పరిగణనలోకి తీసుకునే వారు. మిగిలిన రుణాన్ని మాత్రం ఏడు శాతం వడ్డీతోనే రైతు చెల్లించే వాడు. ఇప్పుడు మాత్రం రైతుకు భూమి విస్తీర్ణాన్ని బట్టీ ఆ భూమిపై వేసే పంటకు సంబంధించి స్కేల్‌ఫైనాన్స్‌కు తగ్గట్టుగా రుణమివ్వాలని ఆర్‌బీఐ స్పష్టంగా ఆదేశించింది.
 
ఇలా అయితే లక్ష్యం కష్టమే..

వరికైతే ఎకరాకు రూ.24వేలు, చెరకుకు రూ.35వేల వరకు మాత్రమే రుణమిస్తారు. పైగా ఒక దస్తావేజు లేదా పట్టాదార్ పాస్‌పుస్తకంపై ఒక రుణాన్ని మాత్రమే పంట రుణంగా పరిగణించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు కుదువపెట్టి భూమి డాక్యు మెంట్లపై తీసుకునే రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎంత రుణం కావాలన్నా ఇస్తారు..కానీ ఆ రుణంపై మాత్రం 12శాతం వడ్డింపు భరించాల్సిందే. దీంతో గతంలో మాదిరి ఎవరికి పడితే వారికి పంటరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చే అధికారం బ్యాంకర్లకు లేదు. అధికారులు సిఫారసు చేసినంత మాత్రాన కౌలురైతులకు రుణాలిచ్చే అవకాశం లేదు. భూమి యజమాని అంగీకార పత్రం కచ్చితంగా ఉండాలి. దీంతో రుణ అర్హత కార్డులు అలంకారప్రాయం కానున్నాయి.
 

మరిన్ని వార్తలు