శ్రీధరణి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ధర్నా

6 Mar, 2019 07:56 IST|Sakshi
భీమడోలులో ర్యాలీ చేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు

పశ్చిమగోదావరి, భీమడోలు: శ్రీధరణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ  పీడీఎస్‌యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భీమడోలు అగ్నిమాపక కేంద్రం వద్ద ధర్నా జరిగింది. శ్రీధరణిని హత్య చేసిన దుండగులను శిక్షించాలని, గీతాం జలి విద్యాసంస్థల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, హత్య జరిగి  రోజులు గడుస్తున్నా ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తొలుత భీమడోలులో విద్యార్థులు, నాయకులు ప్రదర్శన నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ హత్య జరిగిన తర్వాత  లైంగికదాడి జరగలేదని పోలీసులు చెప్పారని, అయితే  దుండగులను పట్టుకుని మీడియా ముందు హాజరపరిచేటప్పుడు శ్రీధరణిపై లైంగికదాడి జరిగిందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాన సాక్షి నవీన్‌ను విచారణ చేయకపోవడం వల్ల శ్రీధరణి మృతికి కారణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉందన్నారు. మరోవైపు ఎన్‌సీసీ తరగతుల పేరుతో అదనపు తరగతులు నిర్వహించడమే ఈ ఘటనకు కారణమని విమర్శించారు. దీనికి కారణమైన గీతాంజలి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చాలా రోజులు  గడుస్తున్నా శ్రీధరణి తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీధరణి కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కోశాధికారి బి.వినోద్, జిల్లా కమిటీ సభ్యుడు ఎస్‌కే ఇమ్రాన్, నాయకులు బి.రాకేష్, ఎం.మహేష్, డి.త్రినాధ్, ఎం.సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు