పుణ్యాలసిరుల క్షేత్రాలివే..

12 Jul, 2015 11:15 IST|Sakshi

పవిత్ర గోదావరి జలాలు ప్రవహించిన నేలంతా పావనప్రదమే. అఖండ గోదావరిగా.. పాయలుగా.. కాలువలుగా ఈ నది జిల్లాలోని అనేక ప్రాంతాలకు చేరుతోంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నో స్నానఘట్టాలున్నాయి. రాజమండ్రి, ఇతర ముఖ్య ప్రాంతాల్లోనే కాదు.. ఈ ఝరి తాకే ప్రతి తావులోనూ పుష్కర స్నానాలకు ఎన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఆ రేవులన్నీ పుణ్యాలసిరులే..


వసిష్ఠ మహర్షి ద్వారమే పుష్కరాల రేవు
రాజమండ్రి నగరంలో గోదావరి రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపాన ఉండటంతో పుష్కరాల రేవు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రేవుకు ఘనమైన పౌరాణిక చరిత్ర ఉంది. వసిష్ఠ మహర్షి ద్వారం, పుష్కర తీర్థం, ఆనందామృత కుండిక అనే పేర్లు ఈ రేవుకు ఉన్నాయి. అహల్యా సంగమ దోష నివృత్తికి దేవేంద్రుడు బ్రహ్మను ప్రార్థించగా, విధాత గోదావరీ తీరంలో ఒక సరస్సు నిర్మించి, అందులో కమండల జలాన్ని ప్రోక్షించాడని, ఇంద్రుడు అందులో స్నానమాచరించి, శాపాన్ని తొలగించుకున్నాడని ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. పుష్కరాల రేవులో రుక్మిణీ సమేత పాండురంగస్వామి ఆలయం, గోదాడ గోషాయి మఠం, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, గోదావరి మాత విగ్రహం, శ్రీ శారదామాత విగ్రహం,  కాశీ విశ్వనాథ ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రేవులో బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్టు, దేవాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి మాతకు నిత్య హారతులు ఇస్తున్నారు.                - రాజమండ్రి కల్చరల్
 
కోటిలింగాల రేవు
ఈ పుష్కరాల సందర్భంగా కోటిలింగాల రేవును దేశంలో అత్యంత పొడవైన స్నానఘట్టంగా తీర్చిదిద్దారు. సుమారు 1120 మీటర్ల పొడవు ఉన్న ఈ రేవులో ఒకే సమయంలో వేలాదిమంది భక్తులు పుష్కర స్నానం చేయవచ్చు. కోటిలింగాల రేవుకు చేర్చి ఉన్న పందిరి మహాదేవుడు సత్రంలో పిండప్రదానాలు చేసుకునే సౌకర్యం ఉంది. ప్రాచీన కాలంలో ఈ రేవులో కోటి శివలింగాలు ఉండేవని చెబుతారు. ‘వేదంలా ఘోషించే గోదావరి’ గీతంలో ఆరుద్ర ‘కొట్టుకొనిపోయె కొన్ని కోటిలింగాలు’ అని ఈ రేవును అభివర్ణించారు. రేవును ఆనుకుని పౌరాణిక ప్రసిద్ధి చెందిన శ్రీ భువనేశ్వరీ సమేత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఉంది.                 - రాజమండ్రి కల్చరల్
 
బాలభానుడికి అభిముఖంగా..
వశిష్ట గోదావరి నది సూర్యునికి అభిముఖంగా ప్రవహించడంతో రాజోలు మండలం సోంపల్లి క్షేత్రానికి ఎంతో ప్రాచుర్యల లభించింది. ఈ ఘాట్‌లో పుష్కర స్నానం చేసి, తూర్పు దిక్కుగా నిలబడి సూర్య నమస్కారం చేసుకునే వీలుంటుంది. ఇలా ఉదయించే సూర్యునికి నమస్కారం చేస్తుండగా.. గోదావరి ప్రవాహం నాభిని తాకుతూ వెనుకవైపు వెళ్లడం ఎంతో పుణ్యప్రదమని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. సోంపల్లి పుష్కర ఘాట్ వశిష్ట నది పశ్చిమ వాహిని ముఖద్వారంలో ఉండడంతో పురాతన కాలం నుంచీ ఈ ఘాట్ పేరుగాంచింది. 214 జాతీయ రహదారిని ఆనుకుని ఈ ఘాట్ ఉంది. ఈ ఘాట్‌కు తూర్పున పార్వతీ సమేత సోమలింగేశ్వరస్వామి ఉన్నారు. పుష్కర స్నానం చేసిన భక్తులందరూ సోమలింగేశ్వరుడిని దర్శించుకుని పునీతులవుతారు.                               - సోంపల్లి (రాజోలు)
 
అంతర్వేది
వశిష్ఠ గోదావరి సాగరంతో సంగమించే ప్రాంతం అంతర్వేది. ఇక్కడి స్నానఘట్టంలో రోజుకు సుమారు 50 వేలమంది పుష్కర స్నానాలు చేస్తారని భావిస్తున్నారు. అలాగే ఇక్కడ వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో విశిష్టమైనది.                 - మలికిపురం
 
కోటిపల్లికి ప్రత్యేక స్థానం
 కె.గంగవరం మండలం కోటిపల్లిలో గోదావరి స్నానం సకల పాపహరణం. పుష్కరాల్లో రాజమండ్రి తరువాత కోటిపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. పిండప్రదానం చేసేందుకు ఇక్కడకు అధికంగా భక్తులు వస్తుంటారు. గౌతమీ గోదావరిలో పుష్కర స్నానమాచరించేందుకు రోజూ లక్షమంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ చంద్ర ప్రతిష్ఠితమైన శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి దర్శనానికి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. కాకినాడ, రాజమండ్రి నుంచి కోటిపల్లికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అలాగే ద్రాక్షారామ నుంచి కూడా కోటిపల్లికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఇవి కాకుండా ద్రాక్షారామ నుంచి కోటిపల్లికి నిత్యం ప్రైవేటు వాహనాలు కూడా ఉంటాయి.                                                   - కోటిపల్లి (కె.గంగవరం)
 
పుణ్యప్రదం.. వైనతేయ స్నానం..
శ్రీ బాలబాలాజీస్వామి కొలువు తీరిన క్షేత్రం అప్పనపల్లి. ఇక్కడ వైనతేయ గోదావరి నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. ఈ నదిలో స్నానం కాశీవద్ద గంగా నదిలో చేసిన స్నానంకంటే పుణ్యప్రదమని.. గాయత్రీ మంత్రంవల్ల కలిగే ప్రయోజనం దీనివల్ల కలుగుతుందని పండితులు చెబుతారు. వినతాసుతుడైన గరుత్మంతుడు (వైనతేయుడు) వశిష్ట నది నుంచి ఈ పాయను తీసుకువచ్చాడు. 2003 పుష్కరాల్లో ఈ పుణ్యక్షేత్రంలో 10 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. ప్రస్తుత పుష్కరాల్లో భక్తుల సంఖ్య రెట్టింపు ఉంటుందన్నది అధికారుల అంచనా. ఇందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు.                                      - అప్పనపల్లి (మామిడికుదురు)
 
మండలం పేరు    :    పుష్కర ఘాట్‌లు ఉన్న గ్రామాలు
 నెల్లిపాక    :    నెల్లిపాక, వెంకటరెడ్డిపేట, గుండాల (ఉష్ణగుండాల)
 వీఆర్ పురం    :    జీడుగుప్ప, పోచవరం, వడ్డిగూడెం
 కూనవరం    :    కూనవరంలో (పోచమ్మరేవు, సాయిబాబా గుడి రేవు, శివాలయం,
         (గోదావరి, శబరి సంగమ ప్రాంతం), గొమ్ముగుడెం
         (కుమారస్వామి ఆలయం వద్ద)
 దేవీపట్నం    :    పోశమ్మగండి, దేవీపట్నం పోలీసు
         స్టేషన్ వద్ద, దేవీపట్నం పెదరామాలయం వద్ద.
 సీతానగరం    :    ముగ్గళ్ల, పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, మునికూడలి.
 రాజమండ్రి రూరల్    :    ధవళేశ్వరం (ఇరిగేషన్ వీఐపీ ఘాట్‌తోపాటు మరో13 ఘాట్‌లు), కాతేరు, వెంకటనగరం.
 కడియం    :    వేమగిరి, పొట్టిలంక, కడియపులంక.
 ఆలమూరు    :    బడుగువానిలంక, జొన్నాడ-2 (హైవేకు ఇరువైపులా), ఆలమూరు.
 కపిలేశ్వరపురం    :    తాతపూడి , కపిలేశ్వరపురం, కోరుమిల్లి.
 కె.గంగవరం    :    సుందరపల్లి, మసకపల్లి, దంగేరు (రామఘట్టాలు), కోట, బ్రహ్మపురి, కూళ్ల.
 తాళ్లరేవు    :    పిల్లంక, గోపులంక, గోవలంక.
 యానాం    :    ఫెర్రీ, బీచ్
 ఐ.పోలవరం    :    మురమళ్ల, కేశనకుర్రు, కొమరగిరి, గుత్తెనదీవి, ఎదుర్లంక.
 కాట్రేనికోన    :    పల్లంకుర్రు, నడవపల్లి.
 ముమ్మిడివరం    :    చింతపల్లిలంక, గేదెల్లంక, బందరుపాలెం.
 అల్లవరం    :    గోడి, బెండమూర్లంక, నక్కా రామేశ్వరం, బోడసకుర్రు.
 అంబాజీపేట    :    మాచవరం (శ్రీరామదుర్గఘాట్), వాకలగరువు, తొండవరం.
 పి.గన్నవరం    :    పి.గన్నవరం, ఆర్.ఏనుగుపల్లి, కె.ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, కె.ముంజువరం, కఠారులంక, ఎల్.గన్నవరం, ఊడుమూడి.
 అయినవిల్లి    :    వీరవల్లిపాలెం, తొత్తరమూడి (ముక్తేశ్వరంరేవు), శానపల్లిలంక, కొండుకుదురు, మడుపల్లి.
 మామిడికుదురు    :    అప్పనపపల్లి (బాలబాలజీ పుష్కరఘాట్), ఆదుర్రు, పాశర్లపూడి, పాశర్లపూడిలంక, పెదపట్నంలంక, బి.దొడ్డవరం, పెదపట్నం.
 మలికిపురం    :    దిండి, రామరాజులంక.
 రాజోలు    :    సోంపల్లి, రాజోలు.
 సఖినేటిపల్లి    :    గుడిమూల, పల్లిపాలెం, అంతర్వేది దేవస్థానం, సఖినేటిపల్లిలంక, అప్పనరాముని లంక, టేకిశెట్టిపాలెం, గొంది, సఖినేటిపల్లి రేవు.
 కొత్తపేట    :    కొత్తపేట (సూర్యగుండాల రేవు), వానపల్లి, వాడపాలెం, గంటి.
 రావులపాలెం    :    గోపాలపురం, పొడగట్లపాలెం, రావులపాలెం, కొమరాజులంక.
 ఆత్రేయపురం    :    వాడపల్లి, ఆత్రేయపురం, ఉచ్చిలి, వద్దిపర్రు, పేరవరం, రాజవరం, వసంతవాడ, కట్టుంగ, అంకంపాలెం.

మరిన్ని వార్తలు