పరీక్ష కేంద్రంలోనే ప్రశ్నపత్రాల ముద్రణ

16 Sep, 2016 02:58 IST|Sakshi

లీకేజీ నివారణకు ఏపీపీఎస్సీ చిట్కా
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీని నివారించడానికి ఏపీపీఎస్సీ కొత్త విధానాన్ని చేపట్టింది. బుధవారం నుంచి ప్రారంభమైన 2011 గ్రూప్1 మెయిన్స్ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. పరీక్ష తేదీలకు చాలా ముందుగా  సెట్ల వారీ ప్రశ్నపత్రాలను రూపొందించడం, దరఖాస్తులనుబట్టీ వాటిలో రెండింటిని ముద్రణకు ఇచ్చి, నేరుగా ఆయా కేంద్రాలకు చేర్చడం  జరుగుతున్న విధానం. దీనివల్ల ఏదో ఒక సందర్భంలో లీకవుతున్నాయి.ఈ దృష్ట్యా ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి ైవె వీఎస్‌టీ సాయిలు ఈసారి కొత్త పంథాను ఎంచుకున్నారు. రూపొందించిన నాలుగైదు సెట్ల ప్రశ్నపత్రాలను సాఫ్ట్ కాపీలుగా తమ వద్దే భద్రపరుచుకున్నారు.

బుధవారం పరీక్ష ప్రారంభానికి గంట ముందు ఒక సెట్  ఎంపిక చేసి ఆయా కేంద్రాలకు ఆన్‌లైన్ ద్వారా పంపారు. పరీక్ష కేంద్రాల్లో వాటిని ప్రింట్ తీయించి అభ్యర్థులకు అందించడానికి సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతతో గదిని కేటాయించారు. హైస్పీడ్ ప్రింటర్ల సాయంతో ప్రింట్ తీసి వాటిని ప్యాక్ చేసి సీల్ వేసి ఆయా గదుల్లోని ఇన్విజిలేటర్లకు పంపిణీ చేయించారు. ప్రశ్నపత్రం ఏదనేది ఏపీపీఎస్సీలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

మరిన్ని వార్తలు