కార్తిక మాసోత్సవాలకు రత్నగిరి సన్నద్ధం

14 Oct, 2017 13:42 IST|Sakshi

అన్నవరం (ప్రత్తిపాడు):   ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్‌ 18 వరకూ కొనసాగనున్న కార్తి్తకమాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం, ప్రభుత్వశాఖల సమన్వయకమిటీ సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం దేవస్థానంలోని ఈఓ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు అ«ధ్యక్షత వహించారు. దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మాట్లాడుతూ దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో శంఖవరం ఎంపీడీఓ శ్రీను, పంపా రిజర్వాయర్‌ ఏఈ వీరబాబు, తుని ఫైర్‌ సర్వీస్‌ అధికారి కేవీ రమణ, దేవస్థానం వైద్యాదికారి డాక్టర్‌ పాండురంగారావు, గ్రామపంచాయతీ కార్యదర్శి రామశ్రీనివాసరావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవిన్యూ, పోలీస్, తదితర విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

సమన్వయకమిటీ సమావేశం నిర్ణయాలు
ముఖ్యమైన పర్వదినాలు: ఈ నెల 23, 30, నవంబర్‌ ఆరోతేదీ, నవంబర్‌ 13వ తేదీ కార్తి్తకమాస సోమవారాలు. 21, 28 నవంభర్‌ నాలుగో తేదీ 11, 18 తేదీలు శనివారాలు, 22,29, నవంభర్‌ 5, 12 వ తేదీలు ఆదివారాలు. 31 వ తేదీ, నవంబర్‌ 14 వ తేదీ కార్తిక శుద్ధ, బహుళ ఏకాదశి పర్వదినాలు వచ్చినందున ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజుల్లో తెల్లవారుజామున రెండు గంటలకే ఆలయం తెరిచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తారు. ఆ రోజుల్లో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి పులిహోర పంపిణీ చేయాలని నిర్ణయించారు.

నవంబర్‌ 1న తెప్పోత్సవం:
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్బంగా నవంబర్‌ ఒకటో తేదీ సాయంత్రం 6–30 గంటల నుంచి 8–30 గంటల వరకూ  సత్యదేవుని తెప్పోత్సవానికి పంపా నదిలో తగినంత నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలి. బాణసంచా కాల్చేటపుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా తుని ఫైర్‌ సిబ్బంది చర్యలు తీసుకోవాలి. పోలీసు బందోబస్తు నిర్వహించాలి.

నాలుగో తేదీన గిరిప్రదక్షిణ :
నవంబర్‌ నాలుగో తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరిప్రదక్షిణ ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. మూడో తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చినందున ఆరోజు రాత్రి జ్వాలాతోరణం, పంపా నదీ హారతులు నిర్వహిస్తారు.

సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభం:
దేవస్థానంలో సహస్రదీపాలంకార సేవను కార్తీకమాసంలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన షెడ్డు నిర్మాణం, ఇతర వస్తుసామగ్రిని కార్తీక పౌర్ణమి నాటికి సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు ఇన్‌చార్జి ఈఓ జగన్నాథరావు సాక్షి కి తెలిపారు.

కార్తీకమాసంలోని పర్వదినాల్లో తెల్లవారుజాము నుంచి వ్రతాలు ప్రారంభిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నపుడు అంతరాలయ దర్శనం రద్దు చేసి ప్రత్యేక దర్శనం టిక్కెట్‌ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్‌ అమలు చేస్తారు. కార్తీకమాసం నెల రోజులు రత్నగిరికి ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు నడపాలని, వైద్య నిర్వహించాలని
నిర్ణయించారు.

మరిన్ని వార్తలు