పంట చేతికందేవరకు పర్యవేక్షిస్తా

29 Dec, 2014 02:24 IST|Sakshi

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 వెంకటాచలం: రైతులకు పంట చేతికందేవరకు సాగునీటి కొరత లేకుండా పర్యవేక్షిస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సర్వేపల్లి కాలువను అనికేపల్లి ర్యాంపు వద్ద ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం సర్వేపల్లి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాకాణి మాట్లాడారు. సాగునీటికి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ప్రధాన కారణం అధికారులకు ముందుచూపు లేకపోవడమేనన్నారు. సంగం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంచెలంచెలుగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నీటి మట్టాన్ని పెంచి మోటార్లు కింద, చెరువు కాలువల ఆయకట్టుకు నీరు అందించేందుకు అధికారులతో చర్చిం చినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఏడు గంటలకు మరో మూడు గంటలు పెంచి 10 గంటలు రైతులకు విద్యుత్ అందించే లా చర్యలు తీసుకున్నామన్నారు.
 
  సర్వేపల్లి రిజర్వాయర్ కింద 40 వేల ఎకరాలు సాగవుతుందన్నారు. సాగునీరు అందే విషయంలో కాలువల ఆధునికీకరణ పనులు కొన్ని మిగిలిపోయి ఉన్నట్లు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రిజర్వాయర్ కింద పదేళ్లుగా రైతులు రెండో పంటకు నోచుకోలేదన్నారు. నిలిచిపోయిన పనులను కాంట్రాక్టర్లతో వెంటనే చేయించాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రిజర్వాయర్‌కు అధిక శాతం నిధులు మంజూరు చేయించారని తెలిపారు.
 
  కనుపూరు కాలువకు నీటిమట్టం పెంచడం వలన రెండు రోజుల్లో నీటి కొరత తీరనుందని తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వేపల్లి రైతాంగానికి అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీటీసీ సభ్యుడు కోసూరు పద్మగౌడ్, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు కనుపూరు కోదండరామిరెడ్డి, పద్మనాభనాయుడు, ఆరుకుంట ప్రభాకర్‌రెడ్డి, కోడూరు ప్రదీప్‌రెడ్డి, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, పోచారెడ్డి సుమంత్‌రెడ్డి, కోసూరు సుబ్బయ్య గౌడ్, సురేష్, శ్రీధర్, కుంకాల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు