సీఎంవోలో సతీష్ చంద్ర కీలకం!

13 Nov, 2014 01:17 IST|Sakshi
సీఎంవోలో సతీష్ చంద్ర కీలకం!

త్వరలో కేంద్ర సర్వీసుకు వెళ్లనున్న అజయ్ సహానీకి శాఖల కోత
సతీష్ చంద్రకు జీఏడీ, నూతన రాజధాని సహా పలు శాఖలు

 సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర సీఎంవోలో ఇక కీలక అధికారిగా మారనున్నారు. త్వరలో కేంద్ర సర్వీసుకు వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ శాఖల్లో భారీగా కోతలు విధించడం, అనేక శాఖలను సతీష్ చంద్రకు అప్పగించడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. తన పేషీ అధికారులు చూడాల్సిన శాఖల్లో (సబ్జెక్టుల్లో) సీఎం తాజాగా అనేక మార్పులు, చేర్పులు చేశారు.
 
  ప్రస్తుతం అజయ్ సహాని నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖ, నూతన రాజధాని, ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహణ, మహిళా శిశు సంక్షేమం, న్యాయ, అసెంబ్లీ, ఐటీ. అటవీ పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక అంశాలతో పాటు ఎవరికీ కేటాయించని అంశాలన్నింటినీ సతీష్ చంద్రకు కేటాయించారు. ప్రస్తుతం సీఎం మరో ముఖ్య కార్యదర్శి గిరిధర్ దగ్గర ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖను, అలాగే సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్ దగ్గరున్న పర్యావరణ, అటవీ శాఖలను సతీష్ చంద్రకు కేటాయించారు. దీంతో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించినట్లే ఇప్పుడు కూడా సీఎంవోలో సతీష్ చంద్ర కీలకంగా వ్యవహరిస్తారనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక అజయ్ సహానీకి కేవలం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను మాత్రమే ఉంచారు. గిరిధర్‌కు మున్సిపల్, హోం, ఆర్థిక, వ్యవసాయం, అన్ని రకాల విద్యలు, రెవెన్యూ శాఖలను కేటాయించారు. సాయిప్రసాద్‌కు ఇంధన, పరిశ్రమలు, ఇరిగేషన్, గృహ నిర్మాణం, అన్ని రకాల సంక్షేమం, కార్మిక, పంచాయతీరాజ్ శాఖలను కేటాయించారు.

మరిన్ని వార్తలు