సబ్‌ప్లాన్ నిధులు సద్వినియోగం చేయాలి

29 Dec, 2013 02:20 IST|Sakshi
గుంటూరు,న్యూస్‌లైన్: సబ్‌ప్లాన్,ఉపాధి హామీ నిధులను సక్రమంగా వినియోగించుకుని దళిత, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డి.డి హనుమంతు కోరారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక సోషల్ వెల్ఫేర్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఁపంచాయతీ పాలనపై ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సురూ. జరిగింది. ఈ సదస్సులో హనుమంతు మాట్లాడుతూ సామాజిక భద్రత పింఛన్లు అందించేందుకు సర్పంచ్‌లు గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో అర్హులైన వారందరికి సామాజిక భద్రత పింఛన్లు అందించేందుకు సర్పంచ్‌లు తోడ్పడాలని కోరారు.  ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి పులిపాక రాణి మాట్లాడుతూ దళితులను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని సూచించారు. అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వినయకుమార్ మాట్లాడుతూ దళిత బహుజన సర్పంచ్‌లు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలని కోరారు. 
 
 అంటరానితనం, అత్యాచారాలు, కులవివక్షతలేని గ్రామాలను నిర్మించేందుకు సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. ప్రతి మైనర్ పంచాయతీ సర్పంచ్‌కు రూ.15 వేలు, మేజర్ పంచాయతీ సర్పంచ్‌కు రూ.20వేలు గౌరవవేతనం ఇవ్వాలని కోరుతూ సదస్సు తీర్మానించింది. అనంతరం జిల్లాలోని రిజర్వుడు పంచాయతీల నుంచి ఎన్నికైన 95మంది సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి అల్లడి దేవకుమార్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేళం భాగ్యారావు, జిల్లా అధ్యక్షుడు మల్లెల చిన్నప్ప, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటి సభ్యులు మేడిద బాబురావు, బి.కోటేశ్వరరావు, సత్తెనపల్లి మార్కెట్‌యార్డు చైర్మన్ వేదాద్రి, ఫార్మా అసోసియేషన్ అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు, దళిత బహుజన మహిళా సమాఖ్య నాయకులు సింగవరపు జ్యోతి, పల్లె జ్యోతి, పాగళ్ల ప్రకాశ్, భూపతి సునీల్‌కుమార్, వెలిచర్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు