ఇక స్టాక్‌యార్డుల్లో నిండుగా ఇసుక

4 Oct, 2019 04:36 IST|Sakshi

రీచ్‌లలో నీరు ఇంకగానే చకచకా ఇసుక  తరలింపునకు ఏపీఎండీసీ ఏర్పాట్లు   

ప్రజలకు కోరినంత ఇసుక సరఫరా  చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు

సాక్షి, అమరావతి: వర్షాలు తగ్గడంతో రీచ్‌లలో నీరు ఇంకిపోగానే స్టాక్‌ యార్డుల నిండుగా ఇసుక నింపి, కోరిన వారికి కోరినంత సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చిన సమయంలోనే ఎగువ ప్రాంతాల్లో, వర్షాలు కురవడం, నదుల్లో వరదనీరు పోటెత్తడం వల్ల ఇసుక సరఫరాలో సమస్య ఏర్పడింది. కొత్త రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, స్థలాలు సమకూర్చి స్టాక్‌ యార్డులను సిద్ధం చేయడం లాంటి పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం–ఏపీఎండీసీ పూర్తి చేశాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తికాక ముందే స్వల్ప కాలంలోనే 1.25 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేయడం గమనార్హం.  కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి గత నెలాఖరు వరకూ ఇసుక కావాలంటూ 10,358 మంది  ఏపీఎండీసీకి ఆన్‌లైన్‌ లో బుకింగ్‌ చేసుకున్నారు. బుక్‌ చేసుకున్న రోజు లేదా మరుసటి రోజు ఉదయమే ఇసుక సరఫరా చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఓపెన్‌ రీచ్‌లు  
►మొత్తం గుర్తించినవి:  138
►పర్యావరణ అనుమతులు ఉన్నవి:  115
►పర్యావరణ అనుమతులు 
►పెండింగ్‌లో ఉన్నవి:  23 
►నీట మునిగి ఉన్నవి:  80
►ఇసుక తవ్వకాలు సాగుతున్నవి:  25

డిసిల్టేషన్‌ కేంద్రాలుమొత్తం:  32 
ప్రస్తుతం పనిచేస్తున్నవి:  9

రైతుల పట్టా భూములు 
గుర్తించిన రీచ్‌లు:  82 
తవ్వకాలు జరుగుతున్నవి:  5

మరిన్ని వార్తలు