'దేశం' దాష్టీకం

14 Jun, 2014 02:22 IST|Sakshi
'దేశం' దాష్టీకం

కనిగిరి : జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కదా.. అని ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు స్వైరవిహారం చేస్తున్నారు. రేషన్ డీలర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి అంగన్‌వాడీల వరకూ అందరిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిని తెలుగు తమ్ముళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. రేషన్ షాపు కోసం పదిమంది కలిసి ఓ వ్యక్తిని కర్రలు, రాళ్లతో కొట్ట్టి అతికిరాతకంగా చంపారంటే టీడీపీ నేతలు ఎంతటి దారుణాలకు వడిగడుతున్నారో అర్థమవుతోంది.

 పీసీపల్లి మండలం పెద అలవలపాడులో డీలర్ నర్సింహారావును టీడీపీ నాయకులు బెదిరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినందున జూన్ నెల డీడీ కట్టవద్దని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన బాధితునిపై గోడవకు దిగి దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసు నమోదు చేయించారు.
 
అసలు గోడవలో లేని తమ పేర్లను ఫిర్యాదులో ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించిన   వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గోగడ శింగయ్య, సురేష్, కంచర్ల తిరపతమ్మలపై టీడీపీ నాయకులు చెన్నుపాటి వెంకటేశ్వర్లు, పువ్వాడి మల్లికార్జున, జి.వెంకట్రావ్, నాగార్జున, డి.కృష్ణతో పాటు మరి కొందరు కలిసి కర్రలు, రాళ్లతో గురువారం రాత్రి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శింగయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం వేకువ జామున మృతి చెందాడు. తిరుపతమ్మ ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టు మిట్డాడుతోంది. సురేష్‌దీ అదే పరిస్థితి.
 ఎంపీపీ సీటుపైనా కుట్ర
 =    తగినంత బలం లేకున్నా కనిగిరి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు.
 =    వైఎస్సార్ సీపీ ఫ్యాను గుర్తుపై గెలిచిన చిన అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడిని ప్రలోభపెట్టారు.
 =    తన భర్తను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఎంపీటీసీ భార్య సంతోషమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 =    తన భర్తకు హాని జరిగే అవకాశం ఉందని, టీడీపీ నేతల చెర నుంచి తన భర్తను కాపాడాలంటూ సంతోషమ్మ అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసినా టీడీపీ నాయకులు కనికరించలేదు.
 =    ఎంపీపీ పీఠాన్ని వైఎస్సార్ సీపీకి దక్కకుండా చేసేందుకు తెలుగు తమ్ముళ్లు కుయుక్తులు పన్నుతున్నారు.
 =    ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే. వెలుగులోకి రాన్ని టీడీపీ అక్రమాలు ఎన్నో ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
 =    మొత్తంగా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని చెప్పవచ్చు.
 పోలీస్ పికెట్
 పెదఅలవలపాడులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కందుకూరు డీఎస్పీ పి.శంకర్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి వచ్చారు. మృతుడు శింగయ్య బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతుని కుమారు సురేష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు పువ్వాడి మల్లికార్జున్, పువ్వాడి వెంకటనారాయణతో పాటు మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్సై ఆరాధ్యుల సుబ్బరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు