టీడీపీ, బీజేపీతోనే ప్రత్యేక హోదా భూస్థాపితం

3 Jun, 2018 13:31 IST|Sakshi

నెల్లూరు: ప్రత్యేక హోదాను టీడీపీ, బీజేపీలే భూస్థాపితం చేశాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో నిర్వహించిన వంచనదీక్షలో ఆయన మాట్లాడారు. నేడు రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 10ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండకుండా ఎందుకు హుటాహుటీన అమరావతికి వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించకుండా ప్రత్యేక ప్యాకేజికి ఎందుకు స్వాగతించారని తమ ప్రశ్నకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా వల్ల ఏంలాభం ఉండదు.. ప్రత్యేక ప్యాకేజీ వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అవగాహనతో చెప్పారో లేక భూస్థాపితం కోసం చెప్పారా అని ప్రశ్నించారు. బాబు మాటలను బట్టి చూస్తే హోదాపై ఆయనకు అవగాహన లేదనిపిస్తోందన్నారు. ప్రస్తుతం చేస్తున్న ధర్మదీక్ష పోరాటం ఎవరిపైన అని ఈసభా వేదికపై నుంచి తాను అడుగుతున్న దానికి బాబు సమాధానం చెప్పాలన్నారు.

 ఓటుకు నోటు కేసు వల్లే బాబు భయపడి హైదరాబాద్‌ నుంచి వచ్చేశారన్నారు. ఇటువంటి సిగ్గులేని దద్దమ్మ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులను కించపరచి మాట్లాడిన బాబు బలహీన వర్గాల వారిని తోలు తీస్తామని అనడం ఆయనకున్న అహంకారమా లేక మరొకటేమైనా అని అన్నారు. ఎవర్ని అయితే అన్నారో తోలుతీస్తామని వారే  త్వరలోనే బాబుకు తోలు తీసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో ఇటీవల అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతునే ఉన్నాయని వాటిని అరికట్టలేకపోయారని ఇంతకంటే అసమర్థ సీఎం ఎక్కడా లేరన్నారు.  ఈ అత్యాచారాల్లో కొన్నింటిలో టీడీపీ కి చెందిన నేతలే ఉన్నారన్నారు.  5మంది ఎంపీలు కలసి మోసగాడైన బాబు మెడలు వంచి యూటర్న్‌తీసుకునేలా చసిన ఘనత అని చెప్పారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా  ఉన్నారన్నారు.

పదవులను త్యాగం చేసిన వారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు : వైఎస్సార్‌ సీపీ నేత జోగి రమేష్‌
కార్పొరేటర్‌ పదవికి ఒక్క రోజు ముందు రాజీనామా చేయమంటేనే తప్పించుకుని తిరుగుతుంటారని, అలాంటిది పంచపాండవులు లా వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులను త్యాగం చేసి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారన్నారు.పదవులు త్యాగం చేసిన వారిని ప్రజలు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. స్వాతంత్య్ర యోధులను ఏవిధంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారో అలా ఐదు మంది ఎంపీలను రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. బెంజిసర్కిల్‌లో చేసిన నవనిర్మాణ దీక్షకు ఎవరూ రాలేదని, చిన్నారులతో ప్రతిజ్ఞ చేయించారన్నారు. చిన్నారులు సైతం చంద్రబాబును అస్సహించుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వారి పై కేసులు పెట్టి, విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించిన నువ్వా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేదని బాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడులో జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడిన తీరు మందు తాగి వచ్చినట్లు ఉందని అన్నారు. మహానాడుని మందు దుకాణంలా చేశారని తెలిపారు. మా నేత జగన్‌ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీకి రెడ్డి ముద్ర వేసేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారని, మా పార్టీ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అండగా నిలిచే పార్టీ అని అన్నారు. 

మరిన్ని వార్తలు