పసుపు కుంకుమలిచ్చాం.. ప్రచారం చెయ్యండి

29 Mar, 2019 13:04 IST|Sakshi

ఎట్టెట్టా...

విశాఖసిటీ : ఏమమ్మా.. మీ అకౌంట్లోకి డబ్బులు వేశాం. పసుపు కుంకుమల పేరుతోనూ నగదు బదిలీ చేశాం. మరి ఎన్నికల టైంలో ఇంట్లో కూర్చుంటే ఎలా.? మా పేరున ప్రచారం చెయ్యండి. లేదంటే... పద్ధతిగా ఉండదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డ్వాక్రా సంఘాలపై బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు డ్వాక్రా సంఘాల్ని ప్రచారానికి వినియోగించుకునే ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారు.

డ్వాక్రా సంఘాలతో ప్రచారం.. ఇప్పుడిదే టీడీపీ ఎత్తుగడ. జిల్లాలోని అన్ని పొదుపు సంఘాల లీడర్లకు ఆయా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, వారి అనుచరుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో..ఎవరైతే పసుపు కుంకుమల పేరుతో డబ్బులు పొందారో వారందర్నీ ప్రచారానికి తీసుకురావాల్సిందిగా డ్వాక్రా లీడర్లను ఆదేశించారు. దీంతో లీడర్లు తమ గ్రూపు సభ్యుల ఇళ్ల చుట్టూ రోజూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే చాలా మంది మహిళలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చెయ్యడం తమ వల్ల కాదంటూ నిరాకరిస్తుండటం.. ఆ విషయాన్ని సదరు నాయకులుకు లీడర్‌ చెప్పడం వారు గ్రూప్‌ లీడర్‌పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతున్న తంతుగా మారిపోయింది. కనీసం విడతల వారీగానైనా ప్రచారం చెయ్యాలనీ, లేదంటే ఫలితం తీవ్రంగా ఉందంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు పలువురు మహిళలు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు