రాఘవేంద్రుడికి వెంకన్న పట్టువస్త్రాలు

15 Mar, 2016 19:57 IST|Sakshi

మంత్రాలయం (కర్నూలు) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ నెల 10న ప్రారంభమైన గురు వైభవోత్సవాలు మంగళవారం నాటితో ముగిశాయి. చివరి రోజున టీటీడీ జేఈఈఓ శ్రీనివాసరాజు, ట్రెజరీ అధ్యక్షుడు గురురాజాచార్ పట్టువస్త్రాలను తీసుకురాగా.. శ్రీమఠం అధికారులు ప్రధాన ముఖద్వారం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీమఠం ప్రాంగణంలో పీఠాధిపతి  సుభుదేంద్రతీర్థులు ఎదురేగి పట్టువస్త్రాలను స్వీకరించారు.

అనంతరం రాఘవేంద్రస్వామి మూల బందావనానికి పట్టువస్త్రాలను అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డోలోత్సవ మండపంలో పీఠాధిపతి మాట్లాడుతూ.. పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి నామం వెంకటనాథుడని గుర్తు చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు అయితే.. జగద్గురువుగా రాఘవేంద్ర స్వామి ప్రజల హదయాల్లో కొలువై ఉన్నారన్నారు. ఇరు దైవాల అనుబంధానికి ప్రతీకగా పట్టువస్త్రాల సమర్పణ ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్యక్రమంలో మఠం ఏఓ రొద్దం ప్రభాకర్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు