శిశుగృహలో ఆడ బిడ్డ మృతి

10 Jul, 2019 07:07 IST|Sakshi

సాక్షి, విజయనగరం : పట్టణంలోని కేఎల్‌పురంలో ఉన్న శిశుగృహాకు చెందిన ఓ ఆడబిడ్డ మంగళవారం మృతి చెందింది. వివారాల్లోకి వెళ్తే...రెండు నెలలు క్రితం ఓ అవివాహిత  ఆడబిడ్డకు జన్మనిచ్చి  శిశుగృహాకు అప్పగించింది. ఆ బిడ్డకు శిశుగృహా సిబ్బంది దీపిక అని పేరు పెట్టారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో శిశుగృహ సిబ్బంది దీపికకు పాలు పట్టడానికి లేచి చూడగా తీవ్ర ఆయాసంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిపడడం గమనించి మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కేంద్రాస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో పాప మృతి చెందింది. దీపిక మృతిని ఐసీడీఎస్‌ ఏపీడీ శాంతకుమారి ధ్రువీకరించారు.కారా (సెంట్రల్‌ ఆడప్సన్‌ రిసోర్స్‌ అధార్టీ) నిబంధనలు ప్రకారం శిశుగృహాకు చెందిన పిల్లలు మృతి చెందితే  ఆ పిల్లలకు పోస్టుమార్టం చేయాలి. దీంతో దీపికకు కూడా శిశుగృహ సిబ్బంది  కేంద్రాస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.

అయితే శిశుగృహలో 11 మంది పిల్లలు  ఉన్నారు. వారిలో  మంగళవారం ఒక పాప మృతి చెందింది. ఆకాష్‌ అనే ఐదు నెలల బాలుడు కూడా రెండు రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో బాలుడిని విశాఖ కేజీహెచ్‌లో శిశుగృహ సిబ్బంది చేర్పించి చికిత్స  అందిస్తున్నారు. వలంటర్‌ అనే  మరో ఐదు నెలల బాలుడికి  ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  

మరిన్ని వార్తలు