గ్రేహౌండ్స్ విభాగాలూ రెండు

3 May, 2014 02:09 IST|Sakshi

విభజనకు కేంద్ర హోంశాఖ అధికారుల ఆమోదం
 
హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో దేశంలోనే పేరెన్నికగన్న, ప్రతిష్టాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషనల్ విభాగం గ్రేహౌండ్స్ ను సైతం రెండుగా విభజించాలని పోలీసు విభాగం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) ప్రతినిధులతో శుక్రవారం సచివాల యంలోని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి టీపీ దాస్ నేతృత్వంలో జరిగన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ అంశాన్ని స్పష్టం చేశారు. మెజార్టీ అధికారులు చెప్పిన అంశాలతో ఏకీభవించిన కేంద్ర ప్రతినిధులు గ్రేహౌండ్స్ విభజనకు ఆమోదముద్ర వేస్తూ ఎంహెచ్‌ఏకు ఈ మేరకు నివేదిక ఇస్తామని రాష్ట్ర ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు.

డీజీపీ బి.ప్రసాదరావుతో పాటు అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలతో పాటు శిక్షణా సంస్థలనూ గరిష్టంగా మూడేళ్ల పాటు కేంద్ర ఆధీనంలో ఉమ్మడిగా ఉంచాలని తొలుత భావించారు. ఆ తర్వాత ఇవి తెలంగాణకే ఉండిపోగా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ అంశాలన్నిటినీ కేంద్ర ప్రతినిధి అనిల్ గోస్వామి వద్ద రాష్ట్ర ఐపీఎస్ అధికారులు ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో అవి రాష్ట్ర పరిధిలోకి వచ్చాయి.
 

మరిన్ని వార్తలు