ఈ టీచర్‌ మాకొద్దు..!

8 Sep, 2018 14:17 IST|Sakshi
శ్రీరామనగర్‌కాలనీ పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, చిన్నమండెం(రాయచోటి రూరల్‌) : చిన్నమండెం మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామపంచాయతీ శ్రీరామనగర్‌కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వాలే నాయక్‌ అనే ఉపాధ్యాయుడు సక్రమంగా విధులకు హాజరు కాలేదన్న కారణంతో ఈ టీచర్‌ మాకొద్దంటూ కాలనీ వాసులు శుక్రవారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా వారు ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చి బయోమెట్రిక్‌లో హాజరు వేసుకుని వెళ్లిపోతాడని, తిరిగి సాయంకాలం బయోమెట్రిక్‌ నమోదు చేసుకుని ఇంటి వెళుతున్నాడని వారు ఆరోపించారు.

పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుకునే స్తోమత లేక ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపుతుంటే ఉపాధ్యాయులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాగోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారిణి శైలజ, మండల ఎంఈఓ శివనాయక్‌కు ఫోన్‌లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసి, వినతిపత్రాన్ని పంపించారు. ఉపాధ్యాయుడు వాలేనాయక్‌ను బదిలీ చేసి, మరో ఉపాధ్యాయున్ని పాఠశాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పలువురు మహిళలు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు