ఆ నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

15 Dec, 2019 04:18 IST|Sakshi

మహిళలు, పిల్లల రక్షణ కోసమే ‘దిశ’

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

సాక్షి, గుంటూరు: యూకేజీ చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నింది తుడిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారిని  శనివారం ఆమె పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.బాబులాల్‌కు సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వపరంగా రావాల్సిన సహాయ సహకారాలు అందేలా చూస్తామని చిన్నారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. కేసులో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించేలా రాష్ట్ర మహిళా కమిషన్‌ సూచనలు జారీ చేస్తుందన్నారు. క్రైమ్‌ రికార్డుల డిజిటలైజేషన్‌లో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారి వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

మరిన్ని వార్తలు