పెళ్లి కుమారుడు ఏమయ్యాడు?

2 Sep, 2015 04:19 IST|Sakshi

చెన్నూరు : గత నెల 22 వతేదీన అదృశ్యమైన పెళ్లి కుమారుని ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. యువకుని సోదరుడు రుహుల్లా కథనం మేరకు.. స్థానిక ఇస్మాయిల్‌సాబ్‌గారి వీధికి చెందిన ఎల్. హబీబుల్లా(28) జులై 22వతేదీ తెల్లవారుజామున మసీదుకు వెళ్లి అప్పటి నుంచి కనిపించడం లేదు. అతని సోదరుడు రుహుల్లా పోలీసులకు అదేరోజు ఫిర్యాదు చేశాడు. చెన్నూరుకు చెందిన హబీబుల్లా కడపలో బంగారు పని చేస్తుండేవాడు. కడపకు చెందిన యువతితో పెద్దలు వివాహం చేసేందుకు నిశ్చయించారు.

కడపలోని కల్యాణ మండపంలో జులై నెల 23న నిఖా జరగాల్సి ఉండింది. బంధువులు వివాహానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నమాజ్‌కు వెళుతున్నానని చెప్పిన అబీబుల్లా ఆ తర్వాత కనిపించలేదు. 40 రోజులు అవుతున్నా ఆచూకీ తెలియ లేదు. మమ్మరంగా పలుచోట్ల గాలించినా ఫలితం లేదు. పోలీసులు కూడా కేసు దర్యాప్తు విషయంలో స్పందించడం లేదు. దీంతో అతను ఏమయ్యాడోనని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు