ఆమె వెంటబడి పోలీసులు కేసులు పెడుతున్నారు

2 Aug, 2018 19:07 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా ఉపయోగించుకుని వైఎస్సార్‌ సీపీ నాయకులను అణిచి వేయాలని చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ క్రికేట్‌ టోర్నమెంట్‌కు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే రోజా శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని, నిలదీస్తోందనే ఉద్దేశంతో కుట్రచేసి ఒక సంవత్సరం పాటు శాసనసభకు రాకుండా సస్పెండ్‌ చేశారని తెలిపారు. రోజా వెంట పోలీసులుపడి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక మహిళకు ప్రజాస్వామ్యంలో మీరు ఇచ్చిన విలువ ఇదేనా అని ప్రశ్నించారు.

గ్రామ దర్శిని పేరిట ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ప్రజలతో బహిరంగ సభలు పెడుతున్నారని, అందులో గ్రామాలకు అవసరమైన అభివృద్ధి గురించి చర్చించకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న పాదయాత్ర గురించి కించపరుస్తూ మాట్లాడటం చౌకబారు తనమన్నారు. చంద్రబాబు అంత నేరస్తుడు ఈ దేశంలోనే ఎవడూ లేడని.. వేల, లక్షల కోట్ల రూపాయలు కాజేశాడని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించారని అన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు చూస్తే ఏ తెలుగువాడైనా బాధ పడవల్సిందేనన్నారు. 

>
మరిన్ని వార్తలు