ప్యాకేజీలు ఆమోదయోగ్యంకాదు..

13 Aug, 2015 01:48 IST|Sakshi
ప్యాకేజీలు ఆమోదయోగ్యంకాదు..

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే కావాలని, ప్యాకేజీలు ఆమోదయోగ్యం కాదని, హోదా సాధించే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని పార్టీ అభిప్రాయపడింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 28న తలపెట్టిన బంద్‌ను వరలక్ష్మీ వ్రతం కారణంగా 29వ తేదీకి వాయిదా వేశామన్నారు.

ఈ బంద్‌లో ఏపీ సర్వతోముఖాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కాంక్షించే ప్రజా సంఘాలు, యువకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా వామపక్షాలను కూడా సంప్రదించామని, వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన తరువాత సీఎం నేతృత్వంలో టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెర తీశారని విమర్శించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సంప్రదించిన అనంతరం చెబుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని జైట్లీ చెబుతున్న సమయంలోనే ఆయన పక్కనే మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు ఉండి ఆయనకు వంత పాడటం విడ్డూరమన్నారు. నెలలోగా హోదా వస్తుందని సుజనా చేసిన వార్తల క్లిప్పింగ్‌లను  చూపించారు. ఇలాంటి హామీలు ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు