మైలవరం పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : మైలవరం పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నాహాలు చేపట్టాయి. దీనికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నా చేయాలంటూ మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైఎస్సార్సీపీ ధర్నాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్ఐ నమోదు చేసిన తప్పుడు కేసులు బటయపడతాయని మంత్రి ఆందోళన చెందుతున్నారని కృష్ణప్రసాద్ విమర్శించారు. ('మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు')
మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశామనే కక్షతో సదరు సీఐ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. దమ్ముంటే పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.