‘బాబు ఒకే రాజధాని అనేది వారి కోసమే’

22 Jan, 2020 12:20 IST|Sakshi

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాదని.. పార్టీని లాక్కుని వచ్చిన వ్యక్తని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మండిపడ్డారు. ఎంతమంది అరుస్తున్నారో అంత మందికి చంద్రబాబు మార్కులు వేస్తున్నారని చురకలు అంటించారు. హైదరాబాద్‌ లాంటి పరిస్థితి రాకూడదనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశంసించారు. చంద్రబాబు తన బినామీల కోసమే ఓకే రాజధాని అంటున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ​

ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారు
వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని చూసి.. వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు గెలిపించారని ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు సింహం ఎవరో.. కుక్క ఎవరో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ సభ్యుల తిట్లు భరించలేకుండా ఉన్నామన్నారు. స్పీకర్‌ స్థానంలో తమ్మినేని సీతారాంను కూర్చొపెట్టేందుకు చంద్రబాబు ముందుకు రాలేదని గుర్తుచేశారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ 151 మంది ఎమ్మెల్యేలను గొర్రెలన్నారని ఆరోపించారు. సభాసాంప్రదాయాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..
బలహీనవర్గానికి చెందిన సభాపతిపై టీడీపీ కావాలనే దురుసుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. సభా నాయకుడిని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రతిపక్షంలో ఉండి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పినా టీడీపీ సభ్యుల్లో మార్పురాలేదని వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు. ఇక అధికారం, అవినీతి లేకపోతే చంద్రబాబకు నిద్ర పట్టదని మరో ఎమ్మెల్యే బాబురావు విమర్శించారు. సీఎం, స్పీకర్‌ వ్యవస్థలను టీడీపీ సభ్యులు అవమానించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్‌లు కూడా రావని బాబురావు జోస్యం చెప్పారు. 

చదవండి: 
అమ్మఒడి ఓ చరిత్రాత్మక పథకం

మండలిలో టీడీపీ సైంధవ పాత్ర

థ్యాంక్యూ.. సీఎం సార్‌ 

‘రియల్‌ ఎస్టేట్‌పైనే చంద్రబాబుకు ప్రేమ’

మరిన్ని వార్తలు