గేట్లు తెరవక ముందే చంద్రబాబు పారిపోయారు

19 Aug, 2019 13:30 IST|Sakshi

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: వరద నీటిలో మునిగిన ప్రతిపక్ష నేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్యకు కుట్ర పన్నినట్టా.. అంటూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. పరువు గంగ పాలవుతుందని బ్యారేజి గేట్లు తెరవక ముందే సారు హైదరాబాద్ పారిపోయారని ఎద్దేవా చేశారు. విలవైన వస్తువులన్నీ తరలించారని, కృష్ణానది కావాలనే ప్రవాహాన్ని పెంచుకుంటోందని చివరకు నిందించేట్టున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చి పడింది...
చంద్రబాబు బీజేపీని వదిలి పెట్టాక కుల మీడియా ఆ పార్టీని ఒక విలన్‌గా చిత్రీకరించిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘మొన్నటి దాకా మోదీ గారిని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసింది. ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారు. ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చి పడింది. రివర్స్ గేర్ వేయక తప్పడం లేద’ని ‍ట్వీట్‌ చేశారు. ‘గతంలో వరదలు, తుఫాన్లు వస్తే చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిచేది. కలెక్టర్లపై ఆగ్రహం, సీఎం వచ్చేదాకా కదలని అధికార గణం అంటూ కుల మీడియా ఆయనను ఆకాశానికెత్తేది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. తిట్లు, సస్పెన్షన్లు లేవు’ అంటూ వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు