ఎయిర్‌టెల్‌తో నోకియా రూ. 7,500 కోట్ల డీల్‌ 

29 Apr, 2020 03:48 IST|Sakshi

5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం జట్టు

న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం ఫిన్లాండ్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 7,500 కోట్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందం  ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది సర్వీస్‌ ఏరియాల్లో ఎయిర్‌టెల్‌ కోసం నోకియా 5జీ రెడీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇందులో భాగంగా ప్రస్తుత అవసరాల కోసం 4జీ సేవలకు ఉపయోగపడే 3 లక్షల పైచిలుకు బేస్‌ స్టేషన్లను నోకియా ఏర్పాటు చేస్తుంది. స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక 5జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి అనువుగా ఇవి ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని, అలాగే భవిష్యత్‌లో 5జీ సేవలకు కూడా పునాదిరాయిగా ఉపయోగపడుతుందని నోకియా ప్రెసిడెంట్‌ రాజీవ్‌ సూరి పేర్కొన్నారు. అంతర్జాతీయ టెలికం సంస్థల సమాఖ్య జీఎస్‌ఎంఏ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం మార్కెట్‌గా భారత్‌ ఉంది. 2025 నాటికి 8.8 కోట్ల దాకా 5జీ కనెక్షన్లు ఉంటాయని అంచనా.  

చదవండి: యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,388 కోట్లు

మరిన్ని వార్తలు