హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమరరాజా బ్యాటరీస్ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.127 కోట్ల నుంచి రూ.120 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,440 కోట్ల నుంచి రూ.1,767 కోట్లకు ఎగసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది.
డిసెంబరు 9 లోగా ఈ మొత్తాన్ని చెల్లించనుంది. రూ.540 కోట్ల మూలధన వ్యయానికి బోర్డు సమ్మతించింది. ఈ మొత్తాన్ని అడ్వాన్స్డ్ స్టాంపెడ్ గ్రిడ్ టెక్నాలజీ, టూ వీలర్ బ్యాటరీ ప్లాంటులో రెండవ పంచింగ్ లైన్, ఎంవీఆర్ఎల్ఏ ప్లాంటు విస్తరణకు వెచ్చి స్తారు. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 1.06 శాతం తగ్గి రూ.771.80 వద్ద స్థిరపడింది.