క్యూ2లో పీవీఆర్‌ ఐనాక్స్‌ జోరు

20 Oct, 2023 06:24 IST|Sakshi

నికర లాభం రూ. 166 కోట్లు

న్యూఢిల్లీ: మలీ్టప్లెక్స్‌ దిగ్గజం పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో నష్టాలను వీడి రూ. 166 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 71 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 686 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు దూసుకెళ్లింది. 2023 ఫిబ్రవరి 6నుంచి పీవీఆర్, ఐనాక్స్‌ విలీనం అమలులోకి రావడంతో ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది.

కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,802 కోట్లుగా నమోదయ్యాయి. విలీనం తదుపరి పీవీఆర్‌ ఐనాక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 4.84 కోట్ల మంది సినిమా హాళ్లను సందర్శించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక సగటు టికెట్‌ ధర అత్యధికంగా రూ. 276కు చేరగా.. ఆహారం, పానీయాల సగటు వ్యయం సైతం రికార్డ్‌ నెలకొల్పుతూ రూ. 136ను తాకింది.

ఈ కాలంలో 37 తెరలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో శ్రీలంకసహా 115 పట్టణాలలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 1,702కు చేరింది. అయితే ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్‌–సెపె్టంబర్‌)లో సరైన ఆదరణలేని మొత్తం 33 స్క్రీన్లను తొలగించింది. మరోవైపు పూర్తి ఏడాదిలో 150–160 కొత్త స్క్రీన్ల ఏర్పాటు బాటలో సాగుతున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో ప్రధానంగా హిందీ సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించినట్లు పేర్కొంది.   

ఫలితాల నేపథ్యంలో పీవీఆర్‌ ఐనాక్స్‌ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,742 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు