2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్‌

22 Aug, 2018 14:33 IST|Sakshi

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది(2018లో) మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఎంట్రీ లెవల్‌ డివైజ్‌ను 6.1 అంగుళాల స్క్రీన్‌లో తీసుకొస్తుండగా.. ఇతర వేరియంట్లను 5.8 అంగుళాలు, 6.46 అంగుళాలలో లాంచ్‌ చేయబోతుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్లను ఆపిల్‌ ఎప్పుడు లాంచ్‌ చేస్తుందో కూడా తెలిసిపోయింది.  ఇద్దరు జర్మన్‌ టెలికాం ఆపరేటర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆపిల్‌ ఈ మూడు ఐఫోన్లను సెప్టెంబర్‌ 12న కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో లాంచ్‌ చేయనుందని తెలిసింది. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా వెంటనే సెప్టెంబర్‌ 14నే ప్రారంభం కాబోతున్నాయట. కొత్తగా లాంచ్‌ అవబోతున్న ఈ డివైజ్‌లు సెప్టెంబర్‌ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని రిపోర్టులు వెల్లడించాయి.  

ఆపిల్‌ అప్‌కమింగ్‌ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇంటర్నెట్‌లో పలు ఆసక్తికర వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రీమియం వెర్షన్‌ ఐఫోన్ల పేరు ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌గా, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ ప్లస్‌గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్టైలస్‌ ఫీచర్‌ అంటే ఆపిల్‌ పెన్సిల్‌ సపోర్టుతో ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయట. స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ ఇటీవల లాంచ్‌ చేసిన గెలాక్సీ నోట్‌ 9కు పోటీగా కూపర్టినో కంపెనీ వీటిని తీసుకొస్తోంది. ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ ప్లస్‌ రెండూ కూడా కంపెనీ ఏ12 బయోనిక్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తాయని, 4జీబీ ర్యామ్‌, ప్రముఖ ఫేస్‌ఐడీ ఫీచర్‌ను ఇవి కలిగి ఉంటాయని సమాచారం. ధర విషయంలో 5.8 అంగుళాల ఓలెడ్‌ స్క్రీన్‌ మోడల్‌ 899 డాలర్లుగా.. 6.46 అంగుళాల ఓలెడ్‌ స్క్రీన్‌ వేరియంట్‌ 999 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్‌ వేరియంట్‌ ధర 650 డాలర్ల నుంచి 800 డాలర్ల మధ్యలో ఉంటుందట. 3జీబీ ర్యామ్‌లో, 64జీబీ, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో ఇది లభ్యమవుతుందని టాక్‌. 


 

మరిన్ని వార్తలు